జస్టిస్ రంజన్ గొగోయ్ తదుపరి ఛీఫ్ జస్టిస్..పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: జస్టిస్ రంజన్ గొగోయ్ను సుప్రీంకోర్టు తదుపరి ఛీఫ్ జస్టిస్గా నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే జస్టిస్ రంజన్ గోగోయ్ నియామకం సరికాదంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు లాయర్లు పిటిషన్ వేశారు. దీన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేసింది. ఈ పిటిషన్ యోగ్యతలేనిదని చెబుతూ ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.
ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు
ఈ పిటిషన్ను ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్గా జస్టిస్ రంజన్ గొగోయ్ నియామకంపై జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ను ఇద్దరు లాయర్లు ఆర్పీ లూథ్రా, సత్యవీర్ శర్మలు దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 12న నలుగురు జడ్జీలు సుప్రీంకోర్టు పాలనా వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించి బాహాటంగానే విమర్శించారు. ఇందులో జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన్ను ఎలా ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారంటూ పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించి సుప్రీంకోర్టు పాలనా వ్యవహారంపై విమర్శలు గుప్పించి న్యాయవ్యవస్థకు మచ్చ తీసుకొచ్చారని పిటిషనర్లు తెలిపారు. కోర్టులో కొన్ని అంతర్గత విబేధాలు రావడాన్ని బహిర్గతం చేసి ప్రజల్లో న్యాయవ్యవస్థను కించపరిచేలా చేశారని ఆరోపించారు. అంతేకాదు రంజన్ గొగోయ్ నియామకం సరికాదని పేర్కొంటూ ఇందుకు సమాధానం ఇవ్వాలని కేంద్రప్రభుత్వం, ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్ రంజన్ గొగోయ్లను ప్రతి వాదులుగా చేర్చారు. అంతేకాదు కేంద్రప్రభుత్వం, ఛీఫ్ జస్టిస్లు న్యాయవ్యవస్థకు మచ్చ తీసుకొచ్చిన వ్యక్తి పేరును సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. అంతేకాదు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు 46వ ఛీఫ్ జస్టిస్గా జస్టిస్ రంజన్ గొగోయ్ను నియమిస్తూ రాష్ట్రపతి సెప్టెంబర్ 3న ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 3న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అస్సోం నుంచి భారత ఛీఫ్ జస్టిస్గా తొలి వ్యక్తి జస్టిస్ గొగోయ్ కావడం విశేషం. 2019 నవంబర్ 17న అంటే తన పదవీ విరమణ చేసేవరకు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్గా జస్టిస్ రంజన్ గొగోయ్ సేవలందించనున్నారు.