బ్రిటీష్ కాలంనాటి చట్టం.. ఇప్పటికీ అమలులోనా? సెక్షన్ 144పై సుప్రీంలో రిట్ పిటిషన్!
న్యూఢిల్లీ : బ్రిటీష్ కాలం నాటి 144 సెక్షన్ను దేశంలో నేటికీ అమలు చేస్తున్నారని, ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ 'మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్'సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 144 సెక్షన్ను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ, అన్యాయంగా నిరసనకారులపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని ఆరోపించింది. దీన్ని ఎత్తివేయడమో లేదంటే దానిని ప్రయోగించడానికి సరైన మార్గదర్శకాలనైనా సూచించాలని కోరింది.
ఎప్పుడో పిటిషన్ వేయాల్సిందన్న సుప్రీం...
144 సెక్షన్ ప్రయోగంపై దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు రాగా జస్టిస్ ఏకే సిక్రీ, ఆశోక్ భూషణ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రాథమికంగా వాదనలను ఆలకించిందది. నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రజలకుగల హక్కులకు, శాంతి భద్రతల పరిరక్షణకు మధ్య సమతౌల్యాన్ని పాటించేందుకు మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. నిజానికి గతంలో ఆచార్య జగదీశ్వరానంద అవధూత కేసులోనే 144వ సెక్షన్ దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ‘‘అప్పుడే ప్రజా సంఘాలు రిటి పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండింది.. కనీసం ఇంతకాలానికైనా దాఖలైనందుకు సంతోషం..'' అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో మీ వైఖరి తెలియజేయమంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసు కమిషనర్ కు నోటీసులు జారీ చేసిన అనంతరం తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
అసలేంటీ ఈ 144 సెక్షన్...
దేశంలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడం బ్రిటిష్ కాలం నాటి అంశం. జాతీయవాదులు ఒకే చోట సమావేశం కాకుండా, గుమికూడకుండా ఉండేందుకు ఆనాడు బ్రిటిష్ పాలకులు చట్టంలో ఈ సెక్షన్ను తీసుకొచ్చారు. బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినా.. వాళ్లు రూపొందించిన అదే చట్టాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికీ ఉపయోగిస్తోంది. ఉపయోగిస్తోంది అనేకంటే దుర్వినియోగం చేస్తోందని అని చెప్పడమే సబబు. ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాల లాంటి వివిధ రకాల ప్రజా పోరాటాలను, ముఖ్యంగా ప్రభుత్వం పట్ల పెల్లుబికే అసంతప్తిని అణచివేసేందుకు ఈ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తారు. ఈ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఒక చోట నలుగురికి మించి గుమికూడరాదు. సమావేశం కాకూడదు. ప్రసంగాలు, నినాదాలు చేయరాదు.
శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినప్పుడే...
శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మాత్రమే, అంటే శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు మాత్రమే ఈ 144 సెక్షన్ను ఉపయోగించాలి. అంటే జాతుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య అల్లర్లు చెలరేగిన సందర్భాల్లో, ఫలానా ప్రజాందోళన కార్యక్రమం వల్ల శాంతియుత పరిస్థితులకు కచ్చితంగా భంగం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే, మరోవిధంగా చెప్పాలంటే అత్యయిక పరిస్థితుల్లోనే ఈ సెక్షన్ను ఉపయోగించాలి.
అది కూడా తాత్కాలిక ప్రాతిపదికనే...
ఈ 144 సెక్షన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి. మానవ హక్కులను కాలరాస్తూ ప్రజల ఆందోళనలను, నిరసనలను, ధర్నాలను, ర్యాలీలను అడ్డుకునేందుకు అడ్డగోలుగా ఈ సెక్షన్ను ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. శాంతియుత పరిస్థితులు నెలకొనడం కోసం తాత్కాలిక ప్రాతిపదికనే.. అంటే రెండు నెలలకు మించి ఈ సెక్షన్ను అమలు చేయడానికి వీల్లేదు. కానీ ఢిల్లీలో పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాల వద్ద ప్రతిరోజూ ఈ సెక్షన్ అమల్లో ఉంటోంది. అంటే ఢిల్లీ పోలీసులు ప్రతి రెండు నెలలకోసారి ఈ నిషేధాజ్ఞలను నోటిఫికేషన్ ద్వారా గుడ్డిగా పొడిగిస్తూ వస్తున్నారు.
గతంలో పార్లమెంట్ భవనం ముందు వరకు...
గతంలో పార్లమెంట్ భవనం ముందు వరకు ప్రజల నిరసన ప్రదర్శనలను అనుమతించే వారు. 1988లో భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ కొన్ని లక్షల మంది రైతులతో ర్యాలీ తీయడంతో ఇండియా గేట్ సమీపంలోని మున్సిపల్ లాన్స్, బోట్ క్లబ్, రాజ్పథ్, పార్లమెంట్ భవనం వరకు రైతులు నిండిపోయారు. ఆ తర్వాత నుంచి పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాలకు సమీపంలో 144వ సెక్షన్ను అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం ఉద్యమాలు చేపడుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేయడం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ను వేదికగా ఎంపిక చేసుకున్నారు.
అందుకే ఈ సెక్షన్ను ఎత్తివేయాలంటూ...
ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కూడా ప్రజల ఆందోళనకు ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే, ప్రజాందోళనల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎంపీలు, సంపన్నులు ‘గ్రీన్ ట్రిబ్యునల్'ను ఆశ్రయించారు. దీంతో ప్రజల ఆందోళన వేదికను పోలీసులు జంతర్ మంతర్ నుంచి రామ్ లీలా మైదానానికి మార్చారు. అయితే రామ్ లీలా మైదానంలో ఎవరైనా తమ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలంటే అందుకు డబ్బులు చెల్లించాలి. ఈ నేపథ్యంలోనే ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్' సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అన్యాయంగా ఉపయోగిస్తున్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని లేదంటూ దాన్ని ప్రయోగించడానికి సరైన మార్గదర్శకాలనైనా సూచించాలని రిట్లో డిమాండ్ చేశారు.