నేతల నేరచరితపై సుప్రీం సీరియస్ వివరణ ఇవ్వాలని ఈసీ, కేంద్రానికి నోటీసులు
Recommended Video
ఢిల్లీ : ఎన్నికల నిబంధనల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందే అభ్యర్థులు తమ నేరచరితను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఈసీ, కేంద్రం ఆదేశాలు పాటించకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
మోడీ ఛరిష్మానే ఎన్డీఏ ఎంపీలకు అండ! ఉత్తరాదిలో పెరుగుతున్న ప్రధాని హవా
ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని 2018 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే వాటిని అమలుచేయకపోవడంతో న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నారిమన్, జస్టిస్ వినీత్ సరన్లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానం ఆదేశాలు పాటించకుండా ఈసీ, కేంద్రం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, న్యాయ, కేబినెట్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది.
మీడియాలో నేరస్థుల వివరాలు
ఎన్నికల్లో పోటీ చేసే నేరస్థుల సంఖ్య పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు వారిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు 2018 సెప్టెంబర్ 25న ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోటీ చేసే అభ్యర్థులందరూ ఎన్నికలకు ముందే తమ నేరచరిత్రను బహిర్గతం చేయాలని, ఆ వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టంచేసింది.
తూతూ మంత్రం చర్యలు
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 10న ఎలక్షన్ కమిషన్ ఫామ్ 26లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులందరూ క్రిమినల్ రికార్డులను బహిర్గతం చేయాలని ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి ఈసీ... ఎలక్షన్ సింబల్ ఆర్డర్ 1968, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోగానీ మార్పులు చేయలేదు. ఫలితంగా క్రిమినల్ రికార్డులు బహిర్గతం చేయాలన్న నిబంధనలకు చట్టబద్ధత లేకుండా పోయింది. అంతేకాదు దేశంలో ప్రముఖ న్యూస్ పేపర్లు, ఛానెళ్ల లిస్టును ప్రకటించకపోవడం, ఏ సమయంలో అభ్యర్థుల నేర వివరాలు ప్రచురించడం, ప్రసారం చేయాలన్న విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఉపాధ్యాయ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.