ఏడుగురు కుటుంబసభ్యుల హత్య: ప్రేమజంట మరణశిక్ష రద్దు చేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఏడుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ ప్రేమ జంటకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. సెషన్స్ కోర్టు జడ్జి హడావుడిగా జారీ చేసిన మరణశిక్షను కొట్టివేసింది.
రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురుచూడకుండా డెత్ వారెంట్పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటు సంతకం చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, మే 25న ప్రేమజంట మరణశిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు, బుధవారం మరణశిక్షను రద్దు చేసింది.
హత్యలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆల్మోరాలో ఈ దారుణం జరిగింది. షబ్నం అనే మహిళ తన ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో వారిని హతమార్చేందుకు కుట్రపన్ని.... ప్రియుడైన సలీంను అందుకు ప్రేరేపించింది. 2008 ఏప్రిల్ 15వ తేదీన మత్తుమందు కలిపిన పాలను కుటుంబసభ్యులంతా తాగేలా చేసింది.
ఆ తర్వాత వారిపై సలీం సాయంతో దాడి చేసి ఒక్కొక్కరిగా హతమార్చింది. చివరకు పదినెలల మేనల్లుడిని కూడా షబ్నం స్వయంగా గొంతు నులిమి చంపేసింది. ఈ కేసులో 2010లో సంబంధిత కోర్టు దోషులిద్దరికీ విధించిన మరణశిక్షను 2013లో అలహాబాదు హైకోర్టు సమర్ధించింది.
కాగా, దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్. ఏకే సిక్రీ, జస్టిస్ యుయు లలిత్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. షబ్నం, సలీంల మరణశిక్ష అమలుపై ఏప్రిల్ 25న నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ మే 27న తదుపరి విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ప్రేమజంట మరణ శిక్షను రద్దు చేసింది.