చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్ వివరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి
న్యూఢిల్లీ: రాఫెల్ వివాదంపై మాట్లాడుతూ చౌకీదార్ చోర్హై వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తన వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించడంపై చింతిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అఫిడవిట్ను పరిశీలించిన న్యాయస్థానం 'రిగ్రెట్ (చింతిస్తున్నాం)' అనే పదానికి అర్థమేంటని రాహుల్ గాంధీ తరపున కోర్టుకు హాజరైన లాయరును ప్రశ్నించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ తరపున వాదిస్తున్న న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కోర్టు చెప్పని దాన్ని ఎలా ఆపాదిస్తారు అని ప్రశ్నించిన చీఫ్ జస్టిస్... క్షమించాల్సిందిగా పూర్తి స్థాయిలో ఎక్కడ అడిగారు అని ప్రశ్నించింది. అంతేకాదు రెండవ అఫడవిట్ దేనికోసం దాఖలు చేశారని ప్రశ్నించింది. అంతేకాదు బ్రాకెట్స్లో రిగ్రెట్ అని రాశారు... దాని అర్థం ఏంటని జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ తరపున సమాధానం ఇచ్చారు సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘ్వీ. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నాను అని అంటే దానర్థం క్షమించమని అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సింఘ్వీ. ఇందులో అనుమానపడాల్సి అవసరం ఎంతమాత్రం లేదని తెలిపారు. అఫిడవిట్లో కొన్ని తప్పులున్నాయని చెప్పిన రాహుల్ గాంధీ ఆ మూడు తప్పులు వచ్చినందున క్షమించాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. అంతేతప్ప సుప్రీంకోర్టుకు ఆపాదించాలన్న ఉద్దేశం తనది కాదని న్యాయస్థానానికి తెలిపారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రం రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదని సమాచారం. ఏమి చెప్పాలని అనుకుంటున్నారో అది పూర్తిగా తమకు అర్థం కావడం లేదని గొగోయ్ వ్యాఖ్యానించారు.