బెంగాల్ సర్కార్ పై మళ్లీ సుప్రీం ఫైర్-డాక్టర్లు విధుల్లో చేరాలని, చర్యలుండవని హామీ..!
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు, కుటుంబ సభ్యులకు సమాచారం, పోస్టుమార్టం ఇలా ప్రతీ అంశంలోనూ బెంగాల్ సర్కార్ వైఫల్యాలను తప్పుబట్టింది. అటు సీబీఐ సైతం ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత తాము ఎంట్రీ ఇచ్చామని, అప్పటికే అన్ని ఆధారాలు ధ్వంసం చేసారని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొంది. వాదనల తర్వాత నిరసనల్లో ఉన్న డాక్టర్లను విధుల్లో చేరాలని, వారిపై ఎలాంటి చర్యలు లేకుండా చూస్తామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది.
మృతురాలికి పోస్టు మార్టం నిర్వహించిన తీరు చూస్తుంటే పోలీసులు సీఆర్పీసీ నిబంధనలు కూడా పాటించలేదని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బెంగాల్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితి చూడలేదని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్ధివాలా అభిప్రాయపడ్డారు. బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ను అసలేం జరిగిందో చెప్పగల సమర్ఝుడైన పోలీసు అధికారిని తనతో తీసుకురావాలని జడ్జి సూచించారు. మరోవైపు బాధితురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించిందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఆధారంగా విచారణ చేయొద్దని సీబీఐని సీజేఐ డీవై చంద్రచూడ్ సూచించారు.

అటు కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ అర్ధరాత్రి జరిగినా మృతదేహానికి పోస్ట్మార్టం తర్వాత 18 గంటలకు పైగా నేరం జరిగిన ప్రదేశం సురక్షితంగానే ఉన్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కానీ రాత్రి 11.30కు ఇది అసహజ మరణంగా కేసు నమోదు చేశారని, ఈ వ్యవహారంపై దృష్టిసారించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత ఉదయం 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సీనియర్ డాక్టర్లు, బాధితురాలి సహోద్యోగులు పట్టుబట్టాకే వీడియోగ్రఫీ నిర్వహంచారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications