ఆ మీటింగ్ వివరాలివ్వం-పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- కొలీజయంపై చర్చ వేళ ?
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో జరుగుతున్న రచ్చ ఇవాళ మరో మలుపు తిరిగింది. దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం 2018లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. దీని ఆధారంగా పలువురు న్యాయమూర్తుల్ని బదిలీలు చేసింది. ఆ మీటింగ్ వివరాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసింది.
న్యాయమూర్తుల నియామకంపై తమ అత్యున్నత ప్యానెల్ అయిన కొలీజియం 2018లో నిర్వహించిన సమావేశం వివరాలను తెలియజేయాలన్న పిటిషన్ ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ఈ చర్చలను ప్రజలకు వెల్లడించలేమని ప్రకటించింది. ఏదైనా (కొలీజియం సమావేశాలలో) చర్చకు వచ్చినా అది ప్రజా బాహుళ్యంలో ఉండకూడదని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇద్దరు న్యాయమూర్తుల నియామకంపై డిసెంబర్ 12, 2018న జరిగిన కొలీజియం సమావేశ వివరాలను బయటపెట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ అయిన సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరారు. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ సమావేశానికి హాజరైన న్యాయమూర్తులలో ఒకరు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
అసలే దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్ధ స్ధానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అవసరమని కేంద్రం వాదిస్తోంది. ఇదే క్రమంలో న్యాయమూర్తుల నియామకం కోసం తాజాగా సుప్రీంకోర్టు పంపిన జాబితాను కూడా కేంద్రం ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అదే సమయంలో ఎన్జేఏసీని సుప్రీంకోర్టు వ్యతిరేకించడంపై ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీనిపై వారితో మాట్లాడాలని తాజాగా అటార్నీ జనరల్ వెంకటరమణికి సైతం సుప్రీంకోర్టు సూచించింది.