కొలీజియం ఉప రాష్ట్రపతి ధన్ కర్ కామెంట్స్-కేంద్రంపై సుప్రీం సీరియస్- కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయలో అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్ధపై తాజాగా ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇదే కార్యక్రమానికి హాజరైన సీజేఐ డీవై చంద్రచూడ్ ముందే కొలీజియం వ్యవస్ధపై విమర్శలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ నిర్ణయాన్ని కాదనడాన్ని ఎక్కడాచూడలేదన్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యంపై కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించిన పది రోజుల తర్వాత.. న్యాయవ్యవస్థ నియామకాల కొలీజియం వ్యవస్థపై వస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు ఇవాళ కేంద్రాన్ని నిలదీసింది. కొలీజియం వ్యవస్థ అనేది ఈ భూమి చట్టమని, సమాజంలోని కొన్ని వర్గాలు కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన దాని అమలు ఆగదని పేర్కొంది. కొలీజియం వ్యవస్ధలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో వారికి తగు సలహా ఇవ్వాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశించే ఏ చట్టం అయినా అందులో భాగస్వాములైన వారందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
ఓ చట్టాన్ని రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని, కానీ దానిని పరిశీలించే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కోర్టు నిర్దేశించిన చట్టాన్ని అమలుచేయడం చాలా ముఖ్యమని తెలిపింది. లేకుంటే ప్రజలు సరైనదని భావించే చట్టాన్ని అనుసరిస్తారని సుప్రీం కోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. అటార్నీ జనరల్ కేసును ప్రభుత్వంతో చర్చిస్తారని పేర్కొంటూ, అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై కేసును సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.