వెబ్సైట్ల వ్యాఖ్యలకు అరెస్టులు: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం!
న్యూఢిల్లీ: సోషల్ వెబ్ సైట్లలో అభ్యంతరక వ్యాఖ్యానాలు చేసే కొందరిని అరెస్టు చేయడం చెదురుముదురు సంఘటనలేనంటూ కేంద్రం అభివర్ణించడాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. అవి చెదురుముదురు సంఘటనలు అని చెప్పడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది.
అవి తీవ్రమైనవని, సిగ్గుమాలిన చర్యలు అని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని సెక్షన్ 66ఏ వివాదాస్పదంగా మారింది. దీని కింద కమ్యూనికేషన్ సర్వీసు ద్వారా అభ్యంతరక సందేశాలు పంపిన వారిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంది.
దీనిని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. ఆ సెక్షన్ కింద చేసిన అరెస్టులను తాము సమర్థించడం లేదని కేంద్రం తరఫు న్యాయవాది చెప్పారు. అవి చట్టబద్ద అధికారాల దుర్వినియోగానికి సంబంధించిన కొన్ని చెదురుముదురు ఘటనలని పేర్కొన్నారు.
అవి చెదురుముదురు ఘటనలే అయినా హక్కుల ఉల్లంఘనలనేవి సిగ్గుమాలిన చర్యలు, తీవ్రమైనవి అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, ఆ హక్కును హరించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఒక మోస్తారు స్థాయి ఆంక్షలకు మాత్రమే అవకాశముందని ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని 66ఏ ను కొట్టివేయాలని కోరారు. అందులోని కొన్ని వ్యక్తీకరణలను సరిగా నిర్వచించలేదని సదరు న్యాయవాది అన్నారు. న్యాయస్థానం జోక్యం చేసుకొని ఇటీవల పార్లమెంటులో ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారాన్ని ప్రస్తావించింది.
అభ్యంతరకరం అనే పదాన్ని సందర్భాన్ని బట్టి భిన్నరీతుల్లో అర్థం చేసుకోవచ్చునని పేర్కొంది. విమర్శను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు సెన్సార్షిప్ కిందకే వస్తాయని సదరు న్యాయవాది పేర్కొన్నారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని, 66ఏ సెక్షన్ సహా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని మూడు సెక్షన్లను కొట్టేయాలని ఓ స్వచ్చంధ సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ కోరారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన నేపథ్యంలో కొత్త రకం నేరాల అదుపునకు ఐటీ చట్టంలో ఆ సెక్షన్ను తెచ్చారా అని కేంద్రంను సుప్రీం కోర్టు అడిగింది.