విద్యా, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు: ఆ రాష్ట్రానికి బిగ్ షాక్
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే కీలక తీర్పు వినిపించింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠీయులకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏ రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని స్పష్టం చేసింది. విద్యా, సామాజిక రంగాల్లో వెనుకబడిన వారిగా మరాఠా సామాజిక వర్గాన్ని రిజర్వుడ్ కేటగిరీలోకి తీసుకుని రాలేమని కుండబద్దలు కొట్టింది. మరాఠా రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వడానికి అవసరమైన సరైన కారణాలు లేవని పేర్కొంది.
మరాఠీయులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై తొలుత బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రభుత్వానికి అనుకూలంగా బోంబే హైకోర్టు తీర్పు వెలువడింది. మరాఠాలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని బోంబే హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ పూర్తి చేసింది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన బెంచ్.. కొద్దిసేపటి కిందటే తీర్పును వినిపించింది. మహారాష్ట్ర సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడి తరగతులు (ఎస్ఈబీసీ) చట్టం-2018లో చేసిన సవరణలను కొట్టేసింది. 2019లో ఈ చట్టంలో మహారాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణలు సరికావని తేల్చింది సుప్రీంకోర్టు. బోంబే హైకోర్టు ఇదివరకు వినిపించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
1992లో ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాపై ఇచ్చిన తీర్పు దీనికి వర్తిస్తుందని పేర్కొంది. మహారాష్ట్ర సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడి తరగతులు (ఎస్ఈబీసీ) చట్టం-2018లో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు సరికావని స్పష్టం చేసింది. 50 శాతం మరాఠా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన సరైన కారణాన్ని ప్రభుత్వం చూపించలేకపోయిందని అయిదు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటి అత్యవసర పరిస్థితులు కూడా లేవని అభిప్రాయపడింది.