సుప్రీంకోర్టులో నేడు తేలనున్న చిదంబరం భవితవ్యం: కస్టడీ పొడగించాలని కోరనున్న సీబీఐ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీ సోమవారంతో ముగియనుంది. మరో వైపు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా ఈరోజే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే, సీబీఐ చిదంబరం విచారణకు మరింత సమయం కావాలని కూడా కోరే అవకాశం ఉంది.
సీబీఐ, చిదంబరం పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తమ తీర్పును వెలువరించనుంది. సీబీఐ కోర్టు చిదంబరంను విచారించేందుకు నాలుగు రోజులపాటు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. నేటితో ఆ గడువు ముగియనుండటంతో సుప్రీంకోర్టు చిదంబరం బెయిల్ పిటిషన్పై విచారించనుంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గత బుధవారం ఢిల్లీ హైకోర్టు చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టడంతో నాలుగు రోజులపాటు కస్టడీ విధించింది. ఆ కస్టడీ ఈ సోమవారంతో ముగిసింది.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేగాక చిదంబరం విచారణకు సరిగా సహకరించడం లేదని సీబీఐ సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. ఈ కారణంగా మరిన్ని రోజులు తమకు చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం సుప్రీంకోర్టులో ఉండనుంది.