కేంద్రంపై సీపీఎం అవిశ్వాస తీర్మానం నోటీసు, భయపడుతున్నారని రాహుల్
న్యూఢిల్లీ/బెంగళూరు: కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఈ మేరకు నోటుసులు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది.
లోకసభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొనేందుకు కేంద్రం భయపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. మైసూరులో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభ, జనాశీర్వాద యాత్రలో మాట్లాడారు.

పది రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతుంటే వాటిని చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుంటోందన్నారు. మోడీ పాలన పగ్గాలను చేపట్టాక ఇంటాబయటా దేశ పరిస్థితి నానాటికీ అధ్వానమైందన్నారు.
యూపీఏ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేసిందని, ఇప్పుడు మాత్రం జడలు విప్పి జవాన్లను బలి తీసుకుంటుందన్నారు. ఒకప్పుడు మనకు స్నేహహస్తాన్ని అందించిన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ దేశాలు ఇప్పుడు చైనాకు దగ్గరయ్యాయన్నారు.












Click it and Unblock the Notifications