కరోనా కలకలం: స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎక్కడ అంటే
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో అలర్ట్ అయ్యారు. నిబంధనలను మరింత కఠినతరం చేశారు. వైరస్ తగ్గుముఖం పట్టిన క్రమంలో పలు రంగాలకు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా కొన్నింటిని తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
మహారాష్ట్రలో కొత్త కరోనా నిబంధనలు : థియేటర్లు, ప్రైవేట్ ఆఫీసుల 50 శాతం సామర్థ్యంతోనే..
పంజాబ్లో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలను తెరవవద్దని సూచించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రజలు గుమి కూడొద్దని, మాల్స్లో వంద మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో సగం సీట్లనే అనుమతించాలని వెల్లడించింది. మహమ్మారి వల్ల పలు ప్రాంతాల్లో కర్ప్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో రెండు గంటలు పొడిగించాలని, జిల్లాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, అంత్యక్రియు వంటి కార్యక్రమాలకు కేవలం 20 మందినే అనుమతినిస్తామని పేర్కొంది.
ఆదివారం సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, మాల్స్ మూసివేయాలని తెలిపింది. మరో రెండు వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని పంజాబ్ ప్రభుత్వం సూచిస్తోంది.