శ్రీరంగనాథ ఆలయంలో రహస్య గది, నేలమాళిగ: తవ్వకాలు
చెన్నై: తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయంలో రహస్య గది, నేలమాళిగ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఆలయంలో మరికొన్ని రహస్య గదులు, గుప్త నిధులు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇందుకోసం తవ్వకాలు జరుపుతున్నారు. తిరుచ్చిలోని శ్రీరంగనాథుడి ఆలయంలో త్వరలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. చెన్నైకి చెందిన పురావస్తు పరిశోధన శాఖ సలహాదారు నరసింహన్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆలయంలో వేణుగోపాల్ సన్నిధిని బండరాళ్లతో, మహా మండపం లోపల కుడివైపు గోడను మట్టితో నిర్మించిన విషయాన్ని గుర్తించారు.

మట్టిగోడపై ధన్వంతరి పెరుమాళ్ చిత్రం ఉంది. ఆ గోడను తొలగించారు. దీంతో రహస్య గది కనిపించింది. అది అయిదు అడుగుల వెడల్పు, ఇరవై అడుగుల పొడవుతో ఉంది. అందులో కొంత మట్టి, సున్నపు రాళ్లు, ఇటుకలతో నిర్మించిన నిచ్చెనలు కనిపించాయి. దీంతో నేలమాళిగ ఉండవచ్చునని అనుమానించారు.
దానిని పరిశీలించాక ఓ బండరాయి కనిపించింది. దానిని తొలగించి చూడటంతో పన్నెండు అడుగుల లోతుతో నేలమాళిగ కనిపించింది. అందులో పరిశీలించగా.. ఏమీ కనిపించలేదు. కాగా, మరికొన్ని నేలమాళిగలు, గదులు ఉండవచ్చునని భావిస్తున్నారు. క్రీస్తు శకం పదో శతాబ్దంలో హొయసలరాజుల కాలంలో దీనిని నిర్మించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications