అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ నుంచి 'రహస్య మద్దతు'??
గుజరాత్ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించాలని ఆ పార్టీకి చెందిన నేతలే కోరుకుంటున్నారని, ఇది సత్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి రహస్యంగా మద్దతిస్తున్నారని వెల్లడించారు. తనను హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ గుజరాత్ లో వెలిసిన పోస్టర్లపై ఆయన స్పందించారు. వాటిని ఏర్పాటు చేసినవారంతా రాక్షసజాతికి చెందినవారన్నారు.

ఏదో ఒకటి చేయాలంటూ కోరుతున్న బీజేపీ శ్రేణులు
'అధికారంలో ఉన్న తమ పార్టీని ఎలాగైనా ఓడించేందుకు ఏదో ఒకటి చేయండంటూ ఎంతోమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు నన్ను వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు.. అటువంటివారంతా ఆప్కు మద్దతివ్వడం కోసం రహస్యంగా పనిచేయాలని కోరుతున్నాను' అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.

గుజరాత్ లో అధికారంలో ఉన్నవారి అహంకారాన్ని అణచివేయాలి
7 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నవారి అహంకారాన్ని అణచివేయాలని, ఆప్ తో కలిసి పనిచేస్తే మీ వ్యాపారాలను నాశనం చేస్తారని నాకు తెలుసు.. అందుకే మీ పని మీరు చేసుకుంటూనే వారిని ఓటమిపాలు చేసేందుకు రహస్యంగా మద్దతివ్వాలని కేజ్రీవాల్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ ఆ పార్టీని వదిలిపెట్టి తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేయడం కోసం కొత్త నాయకులకు, సరికొత్త ఆలోచనలకు ఆప్ నాంది పలుకుతోందన్నారు. త్వరలో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారంలో ఉన్న బీజేపీపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోందని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ ను ఏ సంస్థా ప్రకటించలేదు. పోలింగ్ అయిన తర్వాత ప్రకటించే అవకాశం కనపడుతోంది.

కేజ్రీవాల్ కు ఊహించని స్పందన
అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే పంజాబ్ ను విజయ దుందుభి మోగించిన పార్టీ గుజరాత్ లో కూడా అధికారం కైవసం చేసుకునేదిశగా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ పర్యటనలో ప్రతిసారీ అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒకసారి విమానాశ్రయంలో పలువురు మోడీ మోడీ అని నినాదాలు చేయగా, ఇటీవలి పర్యటనలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ కు సమీపం నుంచి ఒక ప్లాస్టిక్ నీళ్ల సీసా విసురుగా వచ్చిన సమీపంలో పడింది.












Click it and Unblock the Notifications