లష్కరే అగ్రనేత ఖాసిం మృతి: శ్రీనగర్లో ఆందోళన
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు.
అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ప్రదర్శించారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై రాళ్లు కూడా విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భ్రదతా దళాలు భాష్పవాయువు గోళాలను ప్రయోగించాయి.
గురవారం తెల్లవారుజామున శ్రీనగర్ సమీపంలో భద్రతాదళాలు, లష్కరే తోయిబా టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఉగ్రదాడిలో అబూ ఖాసిం హతమయ్యాడు. అబూ ఖాసిం అంత్యక్రియలు శుక్రవారం కుల్గాంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు వేల సంఖ్యలో కాశ్మీర్ వేర్పాటు వాదులు హాజరయ్యారు.
లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయిన అబూ ఖాసిం ఉగ్రవాద చరిత్ర చాలా పెద్దది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నాయకత్వం వహించడంతో పాటు ఆగస్టు 5న ఉదమ్పూర్లో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన దాడిలో అబూ ఖాసిం అలియాస్ అబూ రెహమాన్ ప్రధాన సూత్రధారి.
అంతేకాదు కాశ్మీర్లో ఆర్మీ, పోలీస్ అధికారులే లక్ష్యంగా ఎన్నో దాడులు చేశాడు. పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ ఇచ్చేవాడు. 2013లో హైదర్పురా ప్రాంతంలో ఖాసిం జరిపిన దాడిలో 9 మంది సైనికులు చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నెల మొదటిలో బందీపుర ప్రాంతంలో కౌంటర్ టెర్రరిజం విభాగం సీనియర్ అధికారి అల్తాఫ్ అహ్మద్ హత్యలోనూ అబూ ఖాసిం ప్రమేయం ఉంది. ఈ ఘటన తర్వాత అబూ ఖాసిం తలపై వెల ప్రకటించారు. అబూ ఖాసింను పట్టిచ్చినవారికి రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు.
కాశ్మీర్కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖాందీపుర గ్రామంలో ఖాసింతో పాటు మరో ఉగ్రవాది తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆర్మీ, పారామిలటరీ, కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అబూ ఖాసింను హతమార్చారు.