టీ బిల్లు: యుపిఎపై సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరుకుంటున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ప్రభుత్వాన్ని కూల్చడానికే తాము పనిచేస్తామని, అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోకపోతే పార్లమెటును నడవనివ్వబోమని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. తమకు 80 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉందని కూడా వారు చెబుతున్నట్లు ఆ మీడియా తన వార్తాకథనంలో తెలిపింది.
కాగా, తిరుగుబాటు పార్టీ పార్లమెంటు సభ్యులను ఎదుర్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు సభ్యుల బహిష్కరణకు లోకసభలో ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, హర్షకుమార్ వంటి పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, వారిని బుజ్జగించేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే యుపిఎ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని అంటున్నారు.
ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించే ఆలోచనలో యుపిఎ ప్రభుత్వం ఉంది. తెలంగాణ బిల్లు ఆమోదానికి ఇబ్బందులు ఉండవని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన పెద్దలు అంటున్నారు.