గర్ల్ఫ్రెండ్ లాగే నేతను ఎన్నుకోండి: సల్మాన్ ఖాన్
ముంబై: గర్ల్ఫ్రెండ్ను ఎంపిక చేసుకున్నట్లే నేతను ఎంపిక చేసుకోవాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు.
తమ నియోజకవర్గానికి ప్రయోజనం కలిగిస్తారనే నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. నియోజకవర్గానికి మంచి చేసే నాయకుడిని ఎన్నుకున్నప్పుడు మంచి భావన కలుగుతుందని ఆయన అన్నారు.
గర్ల్ఫ్రెండ్ను, మిత్రులను ఎంపిక చేసుకున్నట్లుగానే నియోజకవర్గం నాయకుడిని ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, పాత తరం నటి వహిదా రెహ్మాన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హేమ మాలిని, సోనాలి బింద్రే, అనుపమ్ ఖేర్, కిరోన్ ఖేర్లతో పాటు పలువురు సెలబ్రిటీలు బుధవారం ఓట్లు వేశారు.
హర్యానా, మహారాష్ట్ర ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుని తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుపమ్ ఖేర్ పిలుపునిచ్చారు. మోడీ గాలి ఉండేదని, ఇప్పటికి కూడా ఉందని, ఎప్పటికీ ఉంటుందని, మోడీ నిజాయితీపరుడు మాత్రమే కాకుండా కఠిన శ్రమ చేసే నాయకుడని కిరోన్ ఖేర్ అన్నారు.
ముంబై ప్రజలు అసంతృప్తికి గురి చేయరని, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేస్తారని ఆశిస్తున్నానని, మనమంతా విద్యావంతులమని, మార్పును కోరుకుంటున్నామని, నగరం బాగుండాలని అనుకుంటున్నామని, మనం ఓటేసినప్పుడే అది బాగుంటుందని నటి సొనాలీ బింద్రే అన్నారు.