‘ఆ విషయాన్ని ముస్లింలకు మోడీయే చెప్పాలి’
ముంబై: ముస్లింలకు ధీటుగా నిలిచేందుకు హిందూ జనాభాను పెంచుకుంటూ పోవడం సమస్యకు పరిష్కారం కాదని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. ఈ విషయంలో ‘సంఘ్' చొరవ తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ అన్ని మతాలకు ఖచ్చితంగా వర్తింపజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించింది.
దేశంలో అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీ అయిన ముస్లిం జనాభా నానాటికీ పెరుగుతున్న కారణంగా దేశంలో భాషా సంబంధ, బౌగోళిక పరమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించింది. తద్వారా దేశ సమైక్యతకు బీటలువారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
అందుకే, కుటుంబ నియంత్రణ పాటించాలని ముస్లింలకు ప్రధాని నరేంద్ర మోడీయే సూటిగా చెప్పాలని శివసేన సూచించింది.

‘దేశ చట్టాన్ని గౌరవించాలని, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన ముస్లింలకు వివరించాలి. ముస్లింలు అర్ధరాత్రి వచ్చి తన ఇంటి తలుపు తట్టినా వారి సమస్యలను పరిష్కరిస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. ఇదే రీతిలో ముస్లింలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా?' అని శివసేన తన అధికారపత్రిక సామ్నాలో పేర్కొంది.
దేశంలో లోక్పాల్ కంటే కామన్ సివిల్ కోడ్ అవసరమని శివసేన అభిప్రాయపడింది. ‘ఘర్ వాపసీ కార్యక్రమాలు నిర్వహించే వారు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. మేం అందుకు అభ్యంతరం చెప్పబోము. అయితే, ఇస్లామిక్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఇది పరిష్కారం కాదు' అని శివసేన పేర్కొంది.












Click it and Unblock the Notifications