మొదట నన్ను పంపించు: మోడీపై మమతా గర్జన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ వలసవాదులను పంపించదలుచుకుంటే మొదట తనను పంపించాలని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. మమతా బెనర్జీ కోటలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ - వోటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో ఉండిపోయిన బంగ్లాదేశ్ చొరబాటుదారులు వెళ్లిపోవాలని అన్నారు.
మోడీ వ్యాఖ్యలపై దీదీ తీవ్రంగా ప్రతిస్పందించారు. మతం పేరున ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెసు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేసింది.

మమతా, నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధం ఈ నెలారంభంలో ప్రారంభమైంది. మోడీని కాగితంపులిగా మమతా బెనర్జీ ఓ ఎన్నికల ర్యాలీలో అభివర్ణించారు. శారద చిట్ఫండ్ కుంభకోణంలోని దోషులను నిజమైన పులి జైలుకు పంపిస్తుందని మోడీ అన్నారు.
ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేశాయని, బంగ్లాదేశ్ చొరబాటుదారులు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని మోడీ ఆదివారంనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సభలో అన్నారు. తమకు ఓటు వేయించుకునేందుకు చొరబాటుదారులకు వామపక్షాలు, కాంగ్రెసు, టిఎంసి ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నాయని, స్థానిక యువతకు మాత్రం ఉద్యోగాలు రాకున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications