ఉగ్రవాదుల కాల్పుల్లో కాంగ్రెస్ నేత మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ పటేల్ను కాల్చి చంపారు. బుధవారం ఉదయం తన స్వస్థలమైన యాదేర్ నుంచి పార్టీ మీటింగ్ నిమిత్తం పుల్వామాకు కారులో బయల్దేరిన ఆయనను స్థానిక రాజ్పురా చౌక్ దగ్గరికి రాగానే ఉగ్రవాదులు చుట్టుముట్టారు.
అనంతరం క్షణాల్లోనే ఆయనపై అనేక సార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పటేల్ అక్కడి మృతి చెందగా కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పటేల్ ఇంతకు ముందు అధికార పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ)లో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి మారారు.
పీడీపీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. 'ఆయన(పటేల్) పవిత్ర ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'అని సీఎం తెలిపారు.