సీనియర్ కాంగ్రెస్ నేత ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కన్నుమూత
కాంగ్రెస్ కురవృద్ధుడు ఎన్డీ తివారి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలైలో పలు శరీర అవయవాలు దెబ్బతిన్నాయి. ఇక అప్పటి నుంచి తివారీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఉమ్మడి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్ సీఎంగా కూడా పనిచేశారు. ఉత్తరాఖండ్ ఆయన సేవలు మరువబోదని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పాటు జరిగాక ఆర్థికంగా, పారిశ్రామికంగా ఉత్తరాఖండ్ అభివృద్ధి పథంలో నడపడంలో తివారి కృషి మరవలేనిదని సీఎం త్రివేంద్రసింగ్ కొనియాడారు.
మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తివారి మృతి చెందారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తివారికి చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు. అయితే జూలైలో పలు శరీర అవయవాలు చికిత్సకు స్పందించడం మానేయడంతో ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీ తివారీ మూడుసార్లు సేవలందించారు. ఉత్తరాఖండ్ సీఎంగా ఒకసారి బాధ్యతలు నిర్వర్తించారు. నాటి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కేబినెట్లో తివారీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఏపీ గవర్నర్గా పనిచేశారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఒకే ముఖ్యమంత్రిగా పని చేసి రికార్డు నెలకొల్పారు తివారీ.