కాల్చుకుని ఏసీపీ ఆత్మహత్య: దూకేసిన భార్య
న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న భార్య ఆ విషయం జీర్ణించుకోలేక నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లోని బాల్కనీ నుంచి కిందకు దూకేసింది.
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నోయిడాలో సోమవారం అర్దరాత్రి ఈ దారుణం జరిగింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లో అమిత్ సింగ్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ)గా ఉద్యోగం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం సరిత అనే మహిళను అమిత్ సింగ్ వివాహం చేసుకున్నాడు.
దంపతులు నోయిడాలో కాపురం ఉంటున్నారు. అమిత్ సింగ్, సరిత దంపతులకు 18 నెలల పాప ఉంది. సోమవారం అర్దరాత్రి అమిత్ సింగ్ ఓ గదిలోకి వెళ్లి సర్వీస్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుని కుప్పకూలిపోయాడు.
వేరే గదిలో ఉన్న సరిత వెళ్లి భర్తను చూసి గట్టిగా కేలు వేసింది. సెక్యూరిటిగార్డులు, ఇరుగు పోరుగు వారు వచ్చి చూశారు. అయితే ఆందోళన చెందిన సరిత నాలుగవ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అమిత్ సింగ్, సరితలను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అమిత్ సింగ్ మరణించాడని వైద్యులు చెప్పారు. సరిత పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఇటివల కాలంలో దంపతులు నిత్యం గొడవపడేవారని అపార్ట్ మెంట్ వాసులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.