జంట వ్యాక్సిన్లపై సీరం ఛీఫ్ కీలక వ్యాఖ్యలు- బ్లేమ్ గేమ్ తప్పదని హెచ్చరిక
భారత్ లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత తలెత్తింది. వ్యాక్సిన్లు పరిమితంగా అందుబాటులో ఉండటం, తయారీ దారుల్ని కూడా విచ్చలవిడిగా అనుమతించే పరిస్ధితి లేకపోవడంతో జంట వ్యాక్సిన్ల చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు వైరస్ వ్యాప్తి కాస్త నెమ్మదించడంతో ప్రభుత్వం కూడా జంట వ్యాక్సిన్ల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. కానీ తయారీదారులు మాత్రం వీటిపై దృష్టిపెట్టారు.
భారత్ లో జంట వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సీరం ఇన్ స్ట్టిట్యూట్ ఇవాళ స్పందించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు కూడా అయిన సీరం ఇన్ స్టిట్యూట్ ఈ ప్రయత్నాలను తప్పుబట్టింది. జంట వ్యాక్సిన్లను తప్పిదంగా సీరం ఛీఫ్ సైరస్ పూనావాలా అభివర్ణించారు. ఇందువల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయన్నారు. ఇలా వ్యాక్సిన్లను కలపడం వల్ల రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
జంట వ్యాక్సిన్ల వల్ల రోగికి ప్రాణాపాయం కానీ, ఇతరత్రా సమస్యలు కానీ తలెత్తితే ఈ రెండు వ్యాక్సిన్లలో దేని తయారీదారు బాధ్య తీసుకోవాలని సీరం ఇన్ స్టిట్యూట్ ఛీఫ్ సైరస్ పూనావాలా ప్రశ్నించారు. తాజాగా భారత్ లో డ్రగ్ కంట్రోలర్ కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కలిపి ఇచ్చేందుకు ప్రయోగాలు నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. తొలిదశలో 300 మందిపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు. దీని ఫలితాల ఆధారంగా జంట వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తారు. దీనిపై స్పందించిన పూనావాలా .. వ్యాక్సిన్లను కలపాల్సిన అవసరం లేదని, అలా చేస్తే ఫలితం ఉంటుందని ఎక్కడా నిరూపణ కాలేదన్నారు.
భారత్ లో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఒక్కో డోస్ ను రోగికి రెండుసార్లు ఇవ్వడం ద్వారా కరోనా వైరస్ ను అరికట్టవచ్చా లేదా అన్న దానిపై పలు ప్రయోగాలు జరగబోతున్నాయి. ఇందులో తొలిదశలో ఈ ప్రయోగాలు చేపట్టకముందే దీనిపై సీరం ఇన్ స్టిట్యూట్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు పరిశీలిస్తే భవిష్యత్తులో ఈ ప్రయోగాలు సక్సెస్ అయినా దీనికి సీరం మద్దతు ఉండకపోవచ్చని తెలుస్తోంది. జంట వ్యాక్సిన్ల వ్యవహారాన్ని ప్రభుత్వానికే వదిలిపెట్టే యోచనలో సీరం ఉన్నట్లు తెలుస్తోంది. తాము కేవలం కోవిషీల్డ్ మాత్రమే సరఫరా చేస్తామని, మరో వ్యాక్సిన్ తో కలిపి ఇవ్వాలా వద్దా అన్నది సీరం ప్రభుత్వ నిర్ణయానికే వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి.