అఖిలేష్కు భారీ షాక్-యూపీ బీజేపీలో కొత్త జోష్: స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు క్లీన్స్వీప్
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హవా కొనసాగింది. 75 జిల్లా పంచాయతీ చైర్పర్సన్ సీట్లకు గానూ ఏకంగా 60కిపైగా స్థానాల్లో విజయ దుంధుభి మోగించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందనుకున్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ చతికిల పడింది.
సమాజ్వాదీ పార్టీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. మొత్తం 75 స్థానాలకు గానూ 67 స్థానాల్లో బీజేపీకి చెందిన మద్దతుదారులు చైర్ పర్సన్లు గెలుపొందినట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. ఇదే ఊపుతో 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ.
మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది ఛైర్ పర్సన్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్కు ముందే 21 చోట్ల బీజేపీ మద్దతుదారులు, ఎస్పీకి చెందిన ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు శనివారం ఉదయం ఓటింగ్ నిర్వహించిన అనంతరం ఫలితాలు వెల్లడించారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడిందని ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాగే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ పోటీ చేయలేదు. కాగా, 2016లో జరిగిన ఇవే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 60 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.