అరవింద్ కేజ్రీవాల్కు షాక్: ఢిల్లీలో కేంద్రానికి అధికారాలు పెంచే బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రం షాకిచ్చింది. ఇకపై ఢిల్లీ ప్రభుత్వం అంటే 'లెఫ్టినెంట్ గవర్నర్' అని నిర్వచించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనలకు దిగినప్పటికీ.. 'ది గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ)' బిల్లు 2021'కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది.
రాజకీయ బిల్లు కాదంటూ కిషన్ రెడ్డి
పాలనా వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను చెరిపేసేందుకు ఈ బిల్లును తెచ్చామని బీజేపీ చెబుతోంది. అయితే, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆప్, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. కాగా, బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దీన్ని రాజకీయ బిల్లుగా పరిగణించొదదని సభ్యులకు సూచించారు.
ఢిల్లీలో పాలనా సామర్థ్యం పెరుగుతుంది..
కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో పాలన విషయంలో ఇప్పటి వరకు ఉన్న అస్పష్టతను సరిచేసేందుకు, గందరగోళాన్ని లేదా సాంకేతికంగా ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుతో ఢిల్లీలో పాలనా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఏళ్లుగా కేంద్రానికి, ఢిల్లీకి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు 2015 నుంచి దెబ్బతిన్నాయని, కొన్ని అంశాలు ఢిల్లీ హైకోర్టు ముందుకెళ్లాయని తెలిపారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం..
ఈ బిల్లు ద్వారా తాము ఎవరి అధికారాలను హరించడం లేదని, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా కొత్తగా ఎలాంటి అధికారాలూ కట్టబెట్టడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పాలనాధికారేనని చెప్పారు. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
ఢిల్లీ ప్రజలకు అవమానమంటూ కేజ్రీవాల్..
కాగా, ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం తీసుకోవాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు ద్వారా తమ అధికారాలను హరిస్తున్నారని, దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, ఈ బిల్లుతో కేంద్రం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.