మమతకు విపక్షాల షాక్-ఢిల్లీ భేటీకి ఆప్, బీజేడీ దూరం-కాంగ్రెస్ పేరు చెప్పి టీఆర్ఎస్ డుమ్మా
విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన భేటీ ఇవాళ జరగబోతోంది. అయితే ఈ సమవేశానికి ముందే మమతా బెనర్జీకి షాకులు తగులుతున్నాయి. ఈ కీలక భేటీకి హాజరు కావడం లేదని బీజేడీ, ఆప్, టీఆర్ఎస్ ప్రకటించాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు నిర్వహిస్తున్న భేటీ ఇవాళ జరగబోతోంది. ఈ మేరకు మమతా బెనర్జీ ఇటీవల 22 ప్రతిపక్ష పార్టీలకు లేఖలు రాశారు, "విభజన శక్తులకు" వ్యతిరేకంగా ఒక వేదికలో భాగం కావాలని వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్తో పాటు ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీ, సీపీఎం, సిపిఐ, జెఎంఎం, శివసేన, ఐయుఎంఎల్, పిడిపి, జెడిఎస్, ఆర్ఎల్డిలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండగా, నవీన్ పట్నాయక్కు చెందిన బిజూ జనతాదళ్ (బిజెడి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సమావేశానికి వెళ్లరాదని నిర్ణయించుకున్న వారిలో ఉన్నారు.
బీజేడీ, ఆప్, టీఆర్ఎస్ వివిధ రాజకీయ కారణాలతో ఈ భేటీకి వెళ్లరాదని నిర్ణయించాయి. వీటిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ భేటీకి హాజరవుతున్నందున వెళ్లరాదని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ తో పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఈ భేటీకి వెళితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తోంది. అందుకే ఈ భేటీకి రాలేమని చెప్పేసింది.
ఇప్పటికే విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా కాంగ్రెస్, మమత ప్రతిపాదిస్తున్న శరద్ పవార్ ఈ రేసు నుంచి తప్పుకుని ఓ షాక్ ఇచ్చారు. ఎలాగో గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ రేసులో ఉండటం వృధా అని ఆయన భావిస్తున్నారు. దీంతో మమతా బెనర్జీ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. గాంధీ ముని మనవడు గోపాలకృష్ణ గాంధీతో పాటు పలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారు. దీంతో ఇవాళ జరిగే భేటీలో ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.