ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడుతో ఏడుగురు మృతి; పలువురికి గాయాలు; సీఎం దిగ్భ్రాంతి!!
బీహార్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని మోతిహారి జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ మోతిహారి జిల్లాలో ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడు ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. మోతిహారి లోని రామ్ గర్వా ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులలో ఇటుక బట్టి యజమాని మహమ్మద్ ఇష్రార్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరిండెంట్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను కంట్రోల్ చేయడం కోసం అగ్నిమాపక కేంద్రాలు రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోతుంది.
ఈ ప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ఇటుక బట్టీ ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందటంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏ ఎస్ పి రక్సుల్ పేర్కొన్నారు.