అమెరికాతో ఉద్రిక్తతల వేళ.. తేల్చిసిన కేంద్రం: ఎన్డీఏ భేటీలో తీర్మానాలు
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వైఖరి వల్ల ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు సన్నగిల్లుతూ వస్తోన్నాయి.. కొంతకాలంగా. ఇష్టారాజ్యంగా భారత్ పై టారిఫ్ ను విధించడం వరకే పరిమితం కావట్లేదాయన. రష్యాతో వ్యాపారాలు చేయొద్దంటూ ఆర్డర్లు వేస్తోన్నారు.
దీనికి భారత్ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాము మాత్రమే రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించట్లేదని, స్వయంగా అమెరికా సహా పలు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు సైతం అదే పని చేస్తోన్నాయని తెలిపింది. ఇందులో జోక్యం తగదని సుతిమెత్తగా హెచ్చరించింది.

ఈ పరిణామాల మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ.. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలో సమావేశమైంది. అమెరికాతో సంబంధాలు సహా పలు అంశాల గురించి కూలంకషంగా చర్చించింది. వాటిపై రూపొందించిన పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్..
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో 'ఆపరేషన్ సింధూర్'పై తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ సమయాల్లో అసాధారణ ధైర్య సాహసాలు, నిబద్ధత కనబరిచిన సాయుధ బలగాలకు సెల్యూట్ చేసింది ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ. దేశాన్ని కాపాడాలనే వారి అచంచలమైన అంకితభావాన్ని ఈ తీర్మానం హైలైట్ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ప్రగాఢ సానుభూతి, గౌరవం ప్రకటించింది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన అసాధారణ నాయకత్వాన్ని ఈ తీర్మానం ప్రశంసించింది. ఆయన అచంచలమైన సంకల్పం, దార్శనికత, రాజనీతిజ్ఞత, తిరుగులేని ఆదేశాలు దేశాన్ని సముచితంగా నడిపించడమే కాకుండా, భారతీయుల హృదయాల్లో ఐక్యత, గర్వం, కొత్త స్ఫూర్తిని రగిలించాయని తీర్మానంలో పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం..
పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా.. ఈ ఏడాది మే 6-7 తేదీల్లో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని, దీన్ని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ప్రశంసించింది. దేశ సైనిక శక్తి, సుదృఢ నాయకత్వం.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం అందించిందని పేర్కొంది. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ క్షమించదని పునరుద్ఘాటించింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ గుర్తు చేసింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు వివిధ పార్టీలకు చెందిన 59 మంది పార్లమెంట్ సభ్యులు.. 32 దేశాల్లో పర్యటించారని, పాకిస్తాన్, ఆ దేశం ప్రోత్సాహిత ఉగ్రవాదం గురించి ఆయా దేశాలకు వివరించాయని, మద్దతును కూడగట్టాయని పేర్కొంది.
పహల్గామ్ దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా గుర్తించడాన్ని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ స్వాగతించింది. టీఆర్ఎఫ్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) గా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. BRICS సభ్య దేశాలు సైతం పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయని, ఇది భారత్ సాధించిన పురోగతిగా అభివర్ణించింది.












Click it and Unblock the Notifications