మగాళ్లను రెచ్చగొట్టే దుస్తులు ధరించేది మీరే.. వారిపై కంప్లైంట్లు ఇచ్చేది మీరే: కోర్టు
తిరువనంతపురం: మహిళల వస్త్రధారణపై కేరళ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులను ధరించి.. తమపై లైంగిక వేధింపులు జరిగాయంటూ మహిళలు ఇచ్చే ఫిర్యాదులు చెల్లబోవని తేల్చి చెప్పింది. ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 74 సంవత్సరాల వయస్సు ఉన్న సివిక్ చంద్రన్కు బెయిల్ పిటీషన్పై వాదనల సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సివిక్ చంద్రన్కు బెయిల్ మంజూరు చేసింది.
2020లో కోజికోడ్ జిల్లా కొయిళనీ సమీపంలోని నంది బీచ్ వద్ద క్యాంప్ ఏర్పాటు చేసిన సమయంలో తనపై సివిక్ చంద్రన్ లైంగిక దాడులకు పాల్పడినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354 ఏ (2), 341, 354 కింద కేసు పెట్టారు. అరెస్టును నివారించడానికి సివిక్ చంద్రన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్పై కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు వాదనలను ఆలకించింది.
సివిక్ చంద్రన్ తరఫున అడ్వొకేట్లు పీవీ హరి, ఎం సుష్మ తమ వాదనలను వినిపించారు. బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించబోవని అన్నారు. రెచ్చగొట్టే దుస్తులను ధరించిన మహిళలు.. పురుషులు తమపై దాడులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడం ప్రైమా ఫేసిగా పరిగణనలోకి తీసుకోలేమని చెప్పారు.
74 సంవత్సరాల వయస్సులో నిందితుడు లైంగిక దాడులకు పాల్పడ్డారనే విషయాన్ని నమ్మలేమని తేల్చి చెప్పారు. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. సంఘటన చోటుచేసుకున్నట్లుగా చెబుతోన్న తేదీ నుంచి ఆరు నెలల తరువాత కేసు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కోజికోడ్ సెషన్స్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల పట్ల మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ద్వారా నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు.