కేజ్రీవాల్ వద్దన్నా శకుంతల బాధ్యతలు: కుట్ర కోణాన్ని చూస్తున్న ఆప్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేస్తున్నా, వద్దని చెబుతున్నా వినకుండా ఢిల్లీ ప్రభుత్వం యాక్టింగ్ ప్రధాన కార్యదర్శిగా శకుంతల గామ్లిన్ పదవీబాధ్యతలు చేపట్టారు. నియమాలకు విరుద్ధం కాబట్టి, బిఎస్ఇఎస్ డిస్కమ్స్కు సన్నిహితంగా ఉండడం వల్ల పదవీ బాధ్యతలు చేపట్టకూడదని సూచిస్తూ అంతకు ముందు ఢిల్లీ ప్రభుత్వం గామ్లిన్కు లేఖ రాసింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెకె శర్మ వ్యక్తిగత పర్యటన మీద ఢిల్లీ వెళ్లడంతో గామ్లిన్ను యాక్టింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కాదని ఆ నియామకం జరపడం నిబంధనలకు విరుద్ధమంటూ అందుకు సంబంధించిన చట్టాన్ని కూడా ఉటంకించింది.
తాజా పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది. నజీబ్ జంగ్ ద్వారా బిజెపి తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని పక్కన పెట్టి నేరుగా అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి అని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా విమర్శించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని, లెఫ్టినెంట్ గవర్నర్ విషయాన్ని తనకు చెప్పలేదని, నేరుగా అధికారులకు ఆదేశాలిచ్చే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు లేదని ఆయన అన్నారు.