సిగ్గు సిగ్గు: కాంగ్రెస్ ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు(వీడియో)
లక్నో/తిరువనంతపురం: కొందరు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుమాలిన పని చేశారు. మొరాదాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో జాతి యావత్తూ సిగ్గుపడాల్సిన ఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న వారిలో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్టు 'సమాచార్ ప్లస్' వార్తా ఛానల్... వీడియో సహా వార్తలను ప్రసారం చేసింది.
యూరీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలో పాకిస్థాన్కు మద్దతు నినాదాలు చోటు చేసుకోవడం, నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ వారించకపోవడం వీడియోలో కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మన సైనికులను చంపిన పాక్కి జై కొడతారా? అంటూ మండిపడుతున్నారు.
credits: samachar plus
కేరళ కాంగ్రెస్ ర్యాలీ.. వివాదాస్పదమే
యూపీ కాంగ్రెస్ అలా ఉండగా, కేరళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ కూడా వివాదాస్పదమైంది. కేరళ రాష్ట్ర కాంగ్రెస్(ఎం) యూత్ వింగ్ కొట్టాయం జిల్లాలో ఇటీవల ఓ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్రంలో కుక్కలు మనుషులపై చేస్తోన్న దాడులు ఎక్కువవుతున్నాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఐదు శునకాలను చంపేసిన కార్యకర్తలు అనంతరం వాటి మృతదేహాలను కట్టెకు వేలాడదీసి వీధుల్లో ర్యాలీలు తీశారు.
నిరసన ప్రదర్శన ముగిశాక స్థానిక పోస్టాఫీస్ ముందు వాటి మృతదేహాలను వదిలేసి వెళ్లిపోయారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తమ తీరుని మార్చుకోవాలని హెచ్చరించారు. అంతేగాక, ఆ కుక్కలను తామే చంపేశామని, కుక్కలు చేస్తోన్న దాడులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలే మళ్లీ జరుగుతాయని వారు హెచ్చరికలు జారీ చేశారు.
కాగా, ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు, ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. కుక్కలను చంపేసిన వారిపై కేసులు నమోదు చేయలేదు. కొన్ని రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీధికుక్కలను చంపుతున్న ఘటనలపై స్పందిస్తూ అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆందోళనకారులు ఈ చర్యకు పాల్పడటం గమనార్హం.