వాఘేలా తెంపరితనం: అహ్మద్ పటేల్ ఎన్నికలో కుట్రకోణం
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరాటంలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ .
న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరాటంలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కుట్ర పూరితంగా వ్యవహరించారని కేంద్ర మాజీ మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపణ.
1996లో నాటి అధికార బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ రాష్ట్రంలో తిరుగుబాటు చేసి, ఎమ్మెల్యేలను ఖజురహోలోని ఫైవ్ స్టార్ హోటల్కు తరలించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎంగా పని చేసి తర్వాత 2004 నుంచి కొంత కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన నేపథ్యం వాఘేలాది. వచ్చే నవంబర్లో గుజరాత్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదన్న సాకుతో పూర్వాశ్రమానికి దగ్గరయ్యేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు.
అవును మరి. ప్రస్తుతం 2002లో సీఎంగా ప్రమాణం చేసింది మొదలు ఇటీవల పంచాయతీ రాజ్ ఎన్నికల వరకు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే అధికారంలో కొనసాగింది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా.. రెండేళ్ల క్రితం హార్దిక్ పటేల్ సారథ్యంలో సాగిన 'పటేళ్ల రిజర్వేషన్' ఆందోళనపై సర్కార్ ఉక్కుపాదం, జీఎస్టీ అమలుతో వ్యాపారుల్లో ఆందోళన.. నోట్ల రద్దుతో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం కమలనాథులను రాష్ట్ర ప్రజలకు దూరం చేశాయి. దీనికి తోడు ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే తిష్ట వేసే పరిస్థితి లేదు.
కాంగ్రెస్ ఏజంట్ కుట్ర పన్నారని వాఘేలా
ఈ నేపథ్యంలోనే సరికొత్త వ్యూహాలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ ద్వయం పన్నిన ఎత్తే రాజ్యసభ ఎన్నికల్లో నైతికంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని. కానీ ఎన్నికలసంఘం నిబంధనలు ఖచ్చితంగా ఉండటంతో అది బెడిసి కొట్టింది. కానీ ఇది కూడా శంకర్ సింఘ్ వాఘేలాకు రుచించకపోవడం ఆశ్చర్యమేమీ లేదు. ఎన్నికల ప్రవర్తనానియమావళి 1961లోని 39 ఏఏ నిబంధన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏజంట్కు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాఘవ్జీ పటేల్, భోల్భాయి గోహెల్ తమ బ్యాలెట్ పత్రాలను చూపడం ఉల్లంఘనే.. కుల్దీప్ నయ్యర్ కేసులోనూ సుప్రీంకోర్టు కూడా ఇదే సంగతి చెప్పింది.
కానీ శంకర్ సింఘ్ వాఘేలా మాత్రం రిటర్నింగ్ అధికారి మాత్రమే తీసుకోవాల్సిన చర్యను పక్కనబెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం అభ్యంతరకరమని కూడా తీర్మానించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలువడానికి అవసరమైన ఫిర్యాదులు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నదని వాఘేలా ఆరోపణ. కాంగ్రెస్ ఏజంట్ శంకర్ సింగ్ గోహెల్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి కుట్రపూరితంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు చూపారని వాఘేలా అభియోగం. అంతటితో ఆగలేదు.
ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టుకు కూడా వెళతామని బీరాలు పలికారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేయకుంటే 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 25 మంది తమ పదవులకు రాజీనామా చేసేవారని మరో బాంబు పేల్చారు. కానీ ఆ విషయం గమనించినందునే.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బెంగళూరులో క్యాంప్ రాజకీయాలు నడిపింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పరువు కాపాడుకున్నది. ఈ సంగతి కూడా వాఘేలాకు రుచించినట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సోహ్రాబుద్దీన్ కేసులో అరెస్ట్ చేసినందుకేనా?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ అంశానికి మాత్రమే మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, అలా ఎందుకు జరగలేదు? గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారం ఎన్నికలు అత్యంత సాదాసీదా జరగాల్సి ఉండగా, ఆద్యంతం ఎందుకు ఉత్కంఠభరితంగా సాగాయి ? అమిత్ షా విజయాన్ని కీర్తించాల్సిన పత్రికల పతాక శీర్షికలు అహ్మద్ పటేల్ ఐదవసారి విజయానికి ఎందుకు పట్టంగట్టాయి? అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధేయుడు, పార్టీ వ్యూహకర్త అమిత్ షా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్గా పోటీ జరగడమే కారణమా? రాజకీయ చాణక్యంలో ఎవరిది పైచేయి అంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అసెంబ్లీలోని బలబలాల ప్రకారం అధికార బీజేపీకి రెండు సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. రెండు సీట్లకు బీజేపీ అమిత్షా, స్మతి ఇరానీ పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ, 2001 నుంచి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉంటూ చక్రం తిప్పుతున్న అహ్మద్ పటేల్ను బరిలోకి దించింది. ఈ ఎన్నికలు సాదాసీదాగా జరగుతాయని, ఇటు అమిత్ షా, అటు అహ్మద్ పటేల్ విజయం సాధిస్తారని రాజకీయ, మీడియా వర్గాలు భావించాయి సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్సింహ్ వాఘేలా పార్టీకి గుడ్బై చెప్పడం, ఆ తర్వాత ఆయన ఆరుగురు విదేయులు పార్టీకి రాజీనామా చేయడంతో అమిత్ షా బుర్రలో కొత్త ఆలోచన పుట్టింది. పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు బల్వంత్ సింగ్ రాజ్పుత్ను రాజ్యసభకు నిలబెట్టారు.
బెంగళూరు కేంద్రంగా రిసార్ట్ రాజకీయం ఇలా
దీంతో కంగారు పడిన కాంగ్రెస్ పార్టీ తన గుజరాత్ ఎమ్మెల్యేలను కర్ణాకకలోని ఓ రిసార్ట్కు తరలించింది. అయినప్పటికీ 15 కోట్ల రూపాయల చొప్పున తమ పార్టీ ఎమ్మెల్యేలకు కొనేందుకు అమిత్ షా ప్రయత్నించారని శక్తిసింహ్ గోయిల్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం ఇచ్చిన బెంగళూరు రిసార్ట్ యజమాని, కాంగ్రెస్ మంత్రి ఇంటిపై, రిసార్ట్పై సీబీఐ దాడులు జరిగాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సీబీఐ దాడులు చేయించిందనే ఆరోపణలు బలంగా వచ్చాయి. గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఇన్ని మలుపులు ఉన్నాయి కనుక సాదాసీదాగా జరగాల్సిన ఎన్నికలు ఆద్యంతం రసవత్తరంగా కొనసాగాయి. అహ్మద్ పటేల్ను లక్ష్యంగా చేసుకొని అమిత్ షా ఎందుకు ఇంత తెగింపుకు దిగారన్న ప్రశ్నకు సమాధానం మిగిలే ఉంది. 2010లో జరిగిన షొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో తనను జైలుకు పంపించారన్న కక్షతోనే అమిత్ షా, పటేల్ను లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది.
పటేల్ పన్నిన చక్రవ్యూహంలో భాగంగానే నాడు సీబీఐ తనను కేసులో అరెస్ట్ చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నమ్మకం. అమిత్ షా వ్యక్తిగతంగా తనపై కక్ష పెంచుకున్నారని అహ్మద్ పటేల్ గత నెలలో బహిరంగంగా వ్యాఖ్యానించడం, అహ్మద్ పటేల్పై కక్షకు షోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాను జైలుకు పంపడమే కారణమని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.
ఇద్దరు ఎమ్మెల్యేల ప్రదర్శన వీడియో నిబిడీకృతం
వరుసగా రాజ్యసభకు నాలుగుసార్లు విజయం సాధించిన అహ్మద్ పటేల్ను ఓడించినట్లయితే ఇటు తన వ్యక్తిగత కక్ష తీరినట్లు ఉంటుందని, ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయంతో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి నైతిక స్థయిర్యం కూడా లేకుండా పోతుందని అమిత్ షా భావించినట్లు అర్థం అవుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో దక్కిన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరుతుందని ఆయన భావించినట్లున్నారు. ఇంతకు ఈ పోరాటంలో విజేతలెవరు? పార్టీ ఎమ్మెల్యేలను తనవెంట ఐక్యంగా ఉంచేందుకు అహ్మద్ పటేల్ అలియాస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేసినా చివరకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్పుత్కు ఓటేసినట్లు వీడియో సాక్షిగా చూపించారు. అందుకు వారి ఓట్లను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
వాటిని ఓట్లుగా పరిగణించాల్సిందేనంటూ బీజేపీ ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులను ఎన్నికల కమిషన్ వద్దకు రాయబారం పంపింది. తీవ్ర ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం మధ్య చర్చోప చర్చలు జరిపిన ఎన్నికల కమిషన్ చివరకు నిబంధనలకు శిరసావహిస్తూ ఇద్దరు రెబెల్ కాంగ్రెస్ శాసన సభ్యుల ఓట్లు చెల్లదని ప్రకటించడంతో అహ్మద్ పటేల్కు అంతిమ విజయం లభించింది. ఇంతకు విజేతలెవరో విజ్ఞులకు తేల్చి చెప్పాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.