రాష్ట్రపతిగా పోటీ చేయలేను-విపక్షాల భేటీలో తేల్చిచెప్పిన శరద్ పవార్
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ కోసం ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలన్న విపక్షాల వ్యూహం విఫలమయ్యేలా కనిపిస్తోంది. తమ తరఫున ఉమ్మడి అభ్యర్ధిగా నిలబడాలని రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను విపక్షాలు కోరినా ఆయన మాత్రం ససేమిరా అనేశారు.
ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్దిని ఖరారు చేసేందుకు ఢిల్లీలో ఇవాళ జరుగుతున్న విపక్షాల భేటీలో శరద్ పవార్ కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్, టీఎంసీ చేసిన ప్రతిపాదనల్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఉమ్మడి అభ్యర్ధి అవసరమే అయినా తాను మాత్రం పోటీ చేయలేనని ఆయన వివరించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్ పోటీపై నెలకొన్న సందిగ్ఘత వీడిపోయింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్ధికి దాదాపు సగం ఓట్ల మెజారిటీ ఉంది. కేవలం 13 వేల ఓట్లు లభిస్తే రాష్ట్రపతి రేసులో ఎన్డీయే నిలబెట్టే అభ్యర్ధి విజయం ఖాయం. అంతే కాదు విపక్ష పార్టీలైన బీజేడీ, వైసీపీ, టీడీపీ కూడా ఎన్డీయేకే మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో ఎన్డీయే అభ్యర్దిపై పోటీ పడి ఓడిపోవడం ఎందుకున్న భావనలో పవార్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు ప్రత్యామ్నాయ అభ్యర్ధులపై దృష్టిసారించాయి. ఇప్పటికే గాంధీ, రాజాజీ మనవడు అయిన గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతి రేసులో నిలబెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే విపక్షాల అభ్యర్ధి ఖరారు అయినట్లవుతుంది.












Click it and Unblock the Notifications