అధికార దాహం కోసం కుటుంబాన్ని విడదీస్తారా? అజిత్ పవార్పై శరద్ పవార్ ఫైర్
మహారాష్ట్రలో ఎన్నికలు సమయం దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార , విపక్ష నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ రోజు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్సీపీ, శివసేనల మధ్య చీలిక తర్వాత జరుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి మహారాష్ట్రపైనే ఉంది.
తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విరుచుకుపడ్డారు. అధికార దాహం కోసం పవార్ కుటుంబాన్ని విచ్ఛినం చేశారని ఆరోపించారు. బారమతి నియోజవర్గంలో తన మనవడు యుగేంద్ర పవార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ తీరుపై విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ఆకాంక్షల కోసం పవార్ వంశం విభజనకు కారణమవుతున్నారని దుయ్యబట్టారు.

తమ కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల సందర్భంగా పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి తన తల్లిదండ్రులు , సోదరులు తనకు ఎప్పుడూ నేర్పించలేదని అన్నారు. అనంతరావు పవార్ సహా తన సోదరులందరితో కలిసి ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయంగా తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన సోదరుల సహాకారంతోనే అని స్పష్టం చేశారు. వారి పిల్లల పట్ల ఎన్నాడూ వివక్ష చూపలేదన్నారు. తమ పార్టీలో ఉన్న ఎంతో మంది నేతలకు ఉన్నత పదవులు ఇచ్చినా తన కుమార్తె సుప్రియా సూలేకు ఒక్క పదవి కూడా అప్పగించలేదన్నారు..
అజిత్ పవార్ నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా పదవులపై వ్యామోహం తగ్గలేదని శరద్ పవార్ మండిపడ్డారు. ఒక్కసారి పదవిలేకపోతే దానికోసం కుటుంబాన్ని చీల్చుతారా అని ప్రశ్నించారు. తన కుటుంబంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా.. వారి ఇష్ట ప్రకారం నడుచుకొమ్మని చెప్తాను కానీ వ్యతిరేకించను అని స్పష్టం చేశారు. మేము అధికారంలో లేనప్పుడు మా కుటుంబ సభ్యులు తమను వదిలి వెళ్లారు.పదవీ కోసం కుటుంబాన్ని ముక్కలు చేయకూడని అజిత్ పవార్కు శరద్ పవార్ హితవు పలికారు.
.












Click it and Unblock the Notifications