ఎగ్జిట్ పోల్స్కు అంత సీన్ లేదు.. బీజేపీ మునిగిపోతున్న నౌక : శశి థరూర్
తిరువనంతపురం : సిట్టింగ్ ఎంపీగా తిరువనంతపురం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ మరోసారి గెలుస్తానంటూ ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు మద్దతు పలికారని.. తమ గెలుపు మార్గం సుగమమైనట్లేనని వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు పట్టం కట్టడంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. అయితే శశిథరూర్ మాత్రం బీజేపీ మునిగిపోతున్న నౌక అంటూ అభిప్రాయపడ్డారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందస్తు విజయోత్సవ వేడుకలకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతుండటం సరికాదన్నారు. డెమొక్రసీలో ఓటర్ల తీర్పే అంతిమమని, మధ్యలోవన్నీ ఊహగానాలే అని కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు.

ఎగ్జిట్ పోల్స్ విషయంలో అంచనాలు చాలాసార్లు తప్పాయని.. వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2004 నాటి ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఖాయమని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ గురి తప్పాయని గుర్తు చేశారు. అందుకే వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయా సంస్థలు, టీవీ ఛానెల్స్ అంచనా వేసినట్లుగా బీజేపీకి అంత భారీ స్థాయిలో సీట్లు రావడం కష్టమన్నారు.
మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి సర్వే చేసే క్రమంలో నిజాలు బయటకు రావన్నారు. వారు ఎవరికి ఓటు వేశారో అనేది కరెక్టుగా చెప్పలేరని.. సంక్షేమ పథకాలు ఎక్కడ దక్కకుండా పోతాయో అనే భయంతో అధికార పార్టీకే వేశామని చెబుతుంటారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications