viral video: ఇద్దరు మలయాళి తాలిబన్ -శశి థరూర్ ట్వీట్పై బీజేపీ ఫైర్ -అఫ్గాన్లో కేరళ యువతి కోసం..
తాలిబన్ల వశమైపోయిన అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు గంట గంటకూ మారిపోతున్నాయి. గత దాష్టీకాల దృష్ట్యా తాలిబన్లను నమ్మని జనం దేశం విడిచి పారిపోతున్నారు. షరియత్ చట్టాలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ ప్రజలు చేసిన తప్పులను క్షమించేశామని, ప్రజలెవరూ దేశం నుంచి వెళ్లొద్దని, ఉద్యోగులు విధుల్లో చేరాలని ప్రకటన చేసిన తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం.. తమ పాలనతో అన్ని స్థానిక తెగలకు, జాతులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ లో నివసిస్తోన్న భారతీయ మూలాలున్న వ్యక్తులు, హిందు, సిక్కులపై చర్చ తెరపైకొచ్చింది. తాలిబన్ నేతలతో హిందూ, సిక్కులు సమావేశమవుతుండగా, అఫ్గానిస్థాన్ లో 'మలయాళీ తాలిబన్లు' ఉన్నారంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ పెను దుమారానికి దారి తీసింది..
Recommended Video
తాలిబన్లతో భారత్ చర్చలు -మోదీ విధానమేంటి?: అఫ్గాన్ సంక్షోభంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
తాలిబన్లో కేరళ జాడలు
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గానిస్థాన్ ఇప్పుడు ఇతర ఉగ్రవాద సంస్థలకూ స్థావరంగా మారిపోయింది. ఇన్నాళ్లూ ఇరాక్, సిరియా, పాకిస్తాన్ కేంద్రాలుగా పనిచేసిన పలు టెర్రర్ సంస్థలు తమ ప్రధాన స్థావరాలను అఫ్గాన్ కు మార్చేశాయని, ఇస్లామిక్ స్టేట్(ఐసిస్), జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు చెందిన టెర్రరిస్టులు పెద్ద సంఖ్యలో అఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి చొరబడ్డారని, వారంతా తాలిబన్ జెండాల ముసుగులో సంచరిస్తున్నారని రిపోర్టులు వెలువడ్డాయి. వందల కొద్దీ సాయుధ ముఠాలు సంచరిస్తోన్న కాబూల్ సిటీలో మలయాళీ తాలిబన్ తాలూకు జాడలున్నాయన్న థరూర్ వ్యాఖ్యలపై కేరళ వాసులు మండిపడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం శశిని తిట్టిపోశారు..
మోదీ సర్కారుకు సీజేఐ రమణ మరో షాక్ -పెగాసస్ నిఘా కుట్రపై నోటీసులు -సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు
ఇద్దరు మలయాళి తాలిబన్లు..
కేంద్ర మాజీ, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. తాలిబన్లతో మలయాళీ లింకు ఉన్నట్లు చెబుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం, రమీజ్ అనే జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోకు శశి థరూర్ సదరు కామెంట్ పెట్టడం కలకలం రేపుతున్నది. ఆదివారం నాడు కాబూల్ సిటీలో చోటుచేసుకున్న ఘటన తాలూకు వీడియోను విశ్లేషిస్తూ.. అక్కడ ఇద్దరు మలయాళి తాలిబన్లు ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు. అయితే, ఎంపీ విశ్లేషణలోని డొల్లతనాన్ని జర్నలిస్ట్ రమీజ్ వెంటనే బయటపెట్టగా, ఈ వివాదాన్ని భాషా పండితులకు వదిలేద్దామంటూ థరూర్ చల్లగా జారుకున్నారు. కానీ ఆ కామెంట్లపై దుమారం మాత్రం కొనసాగుతూనే ఉంది. అసలేం జరిగిందంటే..
మలయాళంలో తాలిబన్ భావోద్వేగం!
మొన్న ఆదివారం నాడు తాలిబన్ సేనలు అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీని చేజిక్కించుకోవడం తెలిసిందే. రెండు దశాబ్దాల కలగా తాలిబన్లు కలగన్న ఆ విజయానికి మురిసిపోతూ, కాబూల్ చేరుకున్న తర్వాత తాలిబన్ ఫైటర్లు నేలపై కూలబడి ఆనందభాష్పాలు రాల్చారు. ఈ దృశ్యాలు రికార్డయిన వీడియోలో వారి మాటలు కూడా వినిపించాయి. ఆ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రియాక్ట్ అవుతూ.. ''అక్కడ ఇద్దరు మలయాళి తాలిబన్లు ఉన్నారు. వీడియోలోని 8వ సెకను వద్ద samsarikkette (నేను మాట్లాడాలా) అనే మలయాళీ పదాన్ని వాడారు. అంటే, ఆ పదం పలికిన వ్యక్తి, విన్న వ్యక్తి ఇద్దరూ మలయాళి తాలిబన్లు కావొచ్చు''అని థరూర్ థియరీకరించారు. అయితే,
ఇంతకీ అది మలయాళమేనా?
ఎంపీ శశి థరూర్ కామెంట్ పై జర్నలిస్టు రమీజ్ నిర్మాణాత్మకంగా స్పందించారు. ''తాలిబన్ ఫైటర్లకు కేరళతో సంబంధం లేనేలేదు. ఈ వీడియోలో ఉన్నవాళ్లు బలోచిస్తాన్కు చెందిన ద్రావిడ భాష బ్రాహ్విలో మాట్లాడుతున్నారు. ఆ భాష మన తెలుగు, తమిళం, మలయాళంకు సమీపంగా ఉంటుంది. బహుశా ఇక్కడ మనం వాడే కొన్ని పదాలు దొర్లి ఉండొచ్చు'' అని రమీజ్ పేర్కొన్నారు. ఈ వివరణ ఆశ్చర్యకరంగా ఉందటూ మరో ట్వీట్ వదిలిన శశి థరూర్.. తాలిబన్లలో మలయాళీలు లేరని మనం కచ్చితంగా చెప్పలేమని, గతంలో కేరళ నుంచి వెళ్లి ఉగ్రవాదుల్లో చేరిన పలువురు తాలిబన్ సేనల్లో ఉండొచ్చని, ఇక మలయాళి పదంపై భాషా పండితులే తేల్చితే బాగుంటుందని శశిథరూర్ ముక్తాయింపు ఇచ్చాయి.
కేరళకు ఉగ్రవాదంతో లింకులా?
ఏదో ఒక చిన్న పదాన్ని పట్టుకుని తాలిబన్లకు కేరళతో లింకులు పెట్టడమేంటంటూ నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా ఇండియాలో హ్యాపీగా ఉన్న మలయాళి తాలిబన్ మీరే నేమో అని ఇంకొందరు ఘాటుగా విమర్శించారు. మలయాళి తాలిబన్లు అంటూ థరూర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సైతం తప్పుపట్టారు. కేరళతో ఉగ్రవాదం లింకు ఉన్నట్లు కాంగ్రెస్ నేత అననడం సిగ్గుచేటని నడ్డా మండిపడ్డారు. కేరళకు చెందిన ఓ హిందూ యువతి.. ఐసిస్ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి అఫ్గానిస్థాన్ వెళ్లిపోగా, ఇప్పుడక్కడ తాలిబన్ల రాజ్యం రావడంతో ఆ యువతి కోసం తల్లి తపిస్తూ, సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తెలిసిందే. కేరళకు చెందిన బిందు అనే మహిళ.. అఫ్గాన్ లో ఐసిస్ ఉగ్రవాదికి భార్యగా చెరలో ఉన్న తన కూతురు నిమిష అలియాస్ ఫాతిమాను విడిపించాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్న సందర్భంలోనే అఫ్గానిస్థాన్ లో అది కూడా తాలిబన్లలో మలయాళీలు ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.