తిరగబడ్డ తులాభారం! శశిథరూర్ తలకు గాయాలు..ఆరు కుట్లేసిన డాక్టర్లు!
తిరువనంతపురం: ఆలయంలో తులాభారం నిర్వహిస్తున్న సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ గాయపడ్డారు. ఆయన తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను తిరువనంతపురం వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. తలకు కుట్లు వేశారు. ఆరు కుట్లు వేసినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు వెల్లడించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రఖ్యాత గాంధారి అమ్మన్ ఆలయంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో శశిథరూర్ తిరువనంతపురం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కూడా. గాంధారి అమ్మవారి ఆలయానికి శశిథరూర్ తరచూ వెళ్తుంటారు. కేరళలో విషు పర్వదినం సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. మనకు ఉగాది తరహాలో మలయాళీలు విషు పండుగను నిర్వహించుకుంటారు. పండగ సందర్భంగా అమ్మవారికి అరటి పండ్లతో తులాభారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తక్కెడలో ఓ వైపు అరటిపండ్లు ఉంచారు. మరోవైపు శశిథరూర్ కూర్చున్నారు. తక్కెడ పైకి లేచిన వెంటనే.. సమతుల్యం తప్పింది.

తక్కెడ పైభాగంలో ఉండే ఇనుప కడ్డీ నేరుగా శశిథరూర్ పై పడటంతో తల కొద్దిగా చిట్లింది. రక్తస్రావమైంది. ఆ ఇనుప కడ్డీ బరువు సుమారు ఎనిమిది కేజీల వరకు ఉంటుందని అంచనా. తిరువనంతపురం వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. శశిథరూర్ తలకు ఆరు కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా.. ఈ నెల 23వ తేదీన మూడో దశలో కేరళలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు.













Click it and Unblock the Notifications