తప్పుగా వద్దు: చీపురు పట్టిన శశిథరూర్, మోడీ కితాబు
ఎర్నాకులం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రశంసించినందుకు కాంగ్రెస్ నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ శనివారం తిరువనంతపురం శివార్లలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే తానేమీ మోడీ ముందు మోకరిల్లడం లేదని, జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని స్పష్టం చేశారు.
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం దేశానికి సంబంధించిన అంశమని, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమానికి తాను మద్దతు ప్రకటించడంపై తప్పుడు అర్థాలు తీయవద్దని విజ్ఞప్తి చేశారు. తిరువనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని విజింజం పట్టణంలో స్థానికులతో కలసి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ఇదేమీ బిజెపి సొంత ఉద్యమం కాదని, తానేమీ మోడీ ముందు మోకరిల్లడం లేదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు మహాత్మా గాంధీ ఎప్పుడో సందేశం ఇచ్చారని, ఇది కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని శశిథరూర్ అన్నారు.
శశిథరూర్
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగానే మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. శశిథరూర్ సూటిగా సమాధానమివ్వలేదు.
శశిథరూర్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ముఖ్యమని, దీనిని ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చన్నారు. తాను ఈ కార్యక్రమంలో పొల్గొన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ హెచ్చరికను ధిక్కరించినట్టు కాదన్నారు.
శశిథరూర్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుంచి నెల రోజుల పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఏఐసీసీ కూడా పిలుపునిచ్చిన విషయాన్ని శశిథరూర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
శశిథరూర్
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న శశిథరూర్ పైన మోడీ స్పందించారు. ఎంపీ శశిథరూర్ స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రోత్సాహకరమని పేర్కొన్నారు. శశిథరూర్ను ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా అభినందించారు.