థరూర్ను ప్రశ్నించే ఛాన్స్, పటేల్తో భేటీ: సునంద మృతిలో మరో కొత్త కోణం!
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో పోలీసులు ఈ వారంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ను ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేదిక్ వైద్యం తీసుకుంటున్న థరూర్ ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. సునంద మృతిపై పోలీసులు హత్య కేసు రిజిస్టర్ చేసిన అనంతరం థరూర్ ఢిల్లీకి వచ్చారు.
అతను కొచ్చి నుండి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అతను నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. విమానాశ్రయంలో విలేకరులు ఆయనను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీని పైన ఆయన స్పందిస్తూ.. ఈ విషయమై తాను ఇప్పటికే మీడియాతో మాట్లాడనని చెప్పి ఇంటికి వెళ్లారు.
సోనియా రాజకీయ కార్యదర్శితో భేటీ
శశిథరూర్ ఆదివారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్తో భేటీ అయ్యారు. శశిథరూర్ రెండు రోజుల క్రితమే ఆయన అపాయింటుమెంట్ కోరినట్లుగా తెలుస్తోంది.
కొత్త కోణం
శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతికి సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె మరణానికి ఐపీఎల్ మాఫియా కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్లో గొడవ ఢిల్లీ విమానాశ్రయంలో థరూర్కు చెంపదెబ్బ వెనకాల మరో మహిళ ప్రస్తావన.. ఐపీఎల్ కోణాన్ని తెర ముందుకు తెచ్చాయంటున్నారు. చివరగా ఫోన్లో మీ చాప్టర్ క్లోజ్ అంటూ సునంద థరూర్కు ఇచ్చిన వార్నింగ్స్పై పోలీసులు దృష్టి సారించారు.