మమత పెద్ద రిగ్గింగ్ రారాణి -ఈవీఎం యంత్రాలపై సాకులా? -బెంగాల్ సీఎంపై బీజేపీ నేత సువేందు ఫైర్
ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఓటమి తప్పదనుకుంటే పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేస్తుందని, ఈవీఎం యంత్రాలను ట్యాంపర్ చేయడానికీ వెనుకాడబోదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన కామెంట్లకు కాషాయదళం ఘాటుగా కౌంటరిచ్చింది.
నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో ఆమెతో తలపడుతోన్న బీజేపీ నేత సువేందు అధికారి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మమతపై అదే స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే పెద్ద రిగ్గింగ్ రారాణి(రిగ్గింగ్ క్వీన్) అంటూ విరుచుకుపడ్డారు. బెంగాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మమతకు ఏమాత్రం ఇష్టం లేదని, రాబోయే ఓటమికి సాకులుగా ఈవీఎం, రిగ్గింగ్ లను చూపాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మమత నాయకత్వంలోని టీఎంసీ పార్టీ చొరబాటుదార్లను ప్రేరేపిస్తోందని, అయినా, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సువేందు మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని మమత పదే పదే మాట్లాడుతున్నారని, 2019 ఎన్నికల సమయంలో యునైటెడ్ ఫ్రంట్ అంటూ తెగ ప్రచారం చేశారని, ఆ విషయం ఏమైందో చెప్పాలని సుబేందు ఎద్దేవా చేశారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీపై గెలిచిన తర్వాత ఢిల్లీలోని కేంద్ర సర్కారును సైతం షేక్ చేస్తానని సీఎం మమత అనడం తెలిసిందే. బెంగాల్ ఎన్నికల్లో మోదీ వర్సెస్ దీదీగా సాగుతోన్న పోరాటంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నీ మమతకు మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సువేందు.. మమతపై కామెంట్లు చేశారు. మొత్తం 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీకి ఈనెల 27 నుంచి ఎనిమిది దశల్లో పోలింగ్ జరుగనుంది.












Click it and Unblock the Notifications