షీనా కేసులో మరో మిస్టరీ! ట్విస్ట్ ఇచ్చిన ఇంద్రానీ భర్త
ముంబై: షీనా బోరా హత్య కేసులో రహస్యం వీడాలంటే ఆమె శరీర అవశేషాల పరీక్ష తర్వాత ఫోరెన్సిక్ విభాగం ఇచ్చే నివేదికనే కీలకం కానుంది. దీంతో సదరు అవశేషాలు షీనావేనా కాదా అన్నది తేల్చలడం కోసం ఆమె తల్లి ఇంద్రానీ, సోదరుడు మిఖాయిల్ (మైఖేల్)ల రక్తం, వెంట్రుకల నమూనాలను కూడా ఫోరెన్సిక్కు పంపించారు.
హత్య తర్వాత సరిగ్గా నెల రోజులకు 2012 మే 23న సగం కాలిన షీనా మృతదేహం, అస్తి పంజరం లభ్యమయ్యాయి. రాయగడ్ పేలీసు స్టేషన్ పోలీసులు అవశేషాలని జెజె ఆసుపత్రికి పంపించారు. దీనిపై వారెందుకు కేసు నమోదు చేయలేదన్నది మరో మిస్టరీగా మారింది.
దీనిపై కొంకణ్ రేంజి ఐజీ విచారణకు ఆదేశించారు. దీని పైన నివేదిక అందగానే బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిజిపి చెప్పారు. నిందితులను క్రైం స్పాట్ వద్దకు తీసుకెళ్లారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

షీనా బోరా హత్య కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. రాయ్గఢ్ అటవీ ప్రాంతంలో షీనాను పాతిపెట్టిన ప్రాంతం నుంచి సేకరించిన శరీర నమూనాలకు పరీక్షల నిమిత్తం ఫొరెన్సిక్ లేబొరేటరీకి పంపారు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం భూమిలో కప్పెట్టారు.
ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించారు. ఖర్ పోలీసులు నుంచి తీసుకున్న షీనా అస్తిపంజరంలోని కొన్ని ఎముకలను జెజె ఆసుపత్రి శుక్రవారం విచారణ అధికారులకు అందజేసింది.
అలాగే షీనా బోరా హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు మరోసారి విచారించారు. తన సోదరి హత్యకు కొద్ది గంటలముందు అంటే 2012 ఏప్రిల్ 24న ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలుసుకున్నారన్న మైఖేల్ బోరా చెబుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
వారు తనను కూడా చంపాలని ప్రయత్నించారని, ముంబై వర్లీలోని ఓ హోటల్ రూమ్లో ఇంద్రాణి, ఖన్నాలు మత్తుపానీయం ఇచ్చారని అతడు పేర్కొన్నాడు. షీనాబోరా హత్య కేసులో స్టార్ ఇండియా మాజీ సిఈవో పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్రాయ్లను ఈ నెల 31 వరకూ రిమాండ్కు తరలించారు.

ఖన్నాను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో అతడే మూడో నిందితుడిగా ఉన్నాడు. ఇలా ఉండగా హతురాలు షీనా పాస్పోర్టును డెహ్రాడూన్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు మారియా స్పష్టం చేశారు. షీనా ఎముకలను డిఎన్ఏ పరీక్షలకు పంపనున్నట్టు వెల్లడించారు.
స్టార్ ఇండియా మాజీ సిఇవో పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి కుమారుడు మైఖేల్ బోరాలను శుక్రవారం ఖర్ పోలీసు స్టేషన్లో ప్రశ్నించారు. పీటర్ ముఖర్జీ లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రాగా పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి వారడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.
షీనా తన కూతురే అని ఇంద్రాణి నాతో చెప్పింది: పీటర్
తన సొంత కూతురు షీనాను హత్య చేసిన కేసులో పోలీసుల రిమాండ్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా మూడో భర్త పీటర్ ముఖర్జియా మరో కొత్త ట్విస్ట్ వెల్లడించారు. షీనా తన సొంత కూతురే అని ఇంద్రాణి తనతో ఎప్పుడో చెప్పిందని చెప్పారు.
అంతకు ముందు, తన కుమరుడు రాహుల్ ముఖర్జియా (పీటర్ తొలి భార్య సంతానం)కు షీనాతో సంబంధం ఉందని పీటర్ తెలిపిన సంగతి తెలిసిందే. షీనా తల్లి ఇంద్రాణియే అని రాహుల్ తనతో అన్నాడని, అయితే ఈ విషయాన్ని ఇంద్రాణి కొట్టి పారేసిందని, షీనా తన చెల్లెలు అనే చెప్పిందని ఇంతకు ముందు పీటర్ చెప్పారు.












Click it and Unblock the Notifications