ఇంద్రాణిని ప్రేమించానన్న లాయర్, నార్కో టెస్ట్కి ఛాన్స్!
ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి గురించిన మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గౌహతికి చెందిన చౌధురి అనే న్యాయవాది మాట్లాడుతూ... తాను ఒకప్పుడు ఇంద్రాణి ప్రేమికుడిని అని తెలిపారు.
కాటన్ కళాశాలలో చదువుకున్నప్పుడు తమ ఇద్దరి మధ్య ప్రేమ అంకురించిందన్నాడు. ఆమె చాలా తెలివైన అమ్మాయి అని, చాలా పెద్ద కోరికలు ఉండేవన్నారు. ఇంద్రాణి పై చదువుల కోసం షిల్లాంగ్ వెళ్లిన తర్వాత తమ ఇద్దరి మధ్య అనుబంధం తెగిందన్నారు. షిల్లాంగ్ కళాశాలలో చదువుకునేటప్పుడు ఇంద్రాణి ఓ ప్రొఫెసర్తో కూడా ప్రేమ వ్యవహారం నడిపిందని వార్తలు ఉన్నాయి.
సంజీవ్ ఖన్నాకు భారీ నజరానా
షీనా హత్య కేసులో మరో అనుమానితుడు ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా మూడేళ్ల క్రితం వరకు కేబుల్ వ్యాపారం చేసేవాడని, ఆ తర్వాత అతనికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బు అందిందని, ఆ సొమ్ముతో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఖన్నాకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూపీ లాగుతున్నారు. సోదరి ఆచూకీ విషయమై ఆరా తీస్తున్న మిఖాయిల్ బోరాను మతిస్థిమితం లేనివానిగా రుజువు చేసేందుకు ఇంద్రాణి ముంబైలో ఒక మానసిక వైద్యుడిని సంప్రదించినట్టు తెలుస్తోంది.
మరోవైపు మీడియా ప్రతినిధులు ఇంద్రాణి మొదటి భర్త సిద్ధార్థ్ దాస్ కుటుంబం ఆచూకీని అస్సాంలో కనుగొన్నారు. గత పదేళ్లుగా సిద్ధార్థ్ దాస్తో తమ కుటుంబానికి సంబంధాలు లేవని దాస్ తమ్ముడు శంతను దాస్ చెప్పారు. సిద్ధార్థ్కు ఇంద్రాణికి వివాహమైన మాట వాస్తవమేనని చెప్పారు.
నార్కో టెస్టులకు అవకాశం
షీనా బోరా హత్య కేసులో నిందితులు ఇంద్రాణి, మాజీ భర్త సంజయ్ ఖన్నాలను నార్కో టెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముంబై పోలీసులు ఇందుకోసం న్యాయస్థానం అనుమతి కోరనున్నారు.