కావేరీ వివాదం: బోర్డు ఏర్పాటు ఆలస్యంపై సుప్రీం సీరియస్, అలా అయితే కోర్టు ధిక్కారమే
న్యూఢిల్లీ: కావేరీ జలాల వివాదంపై తాము ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ఈ విషయమై మే 14వ తేదిన వ్యక్తిగతంగా హజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వ్యక్తిగతంగా హజరుకాకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని హెచ్చరించింది.
కావేరీ జలాల పంపిణీ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయమై ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు. బోర్డు ఏర్పాటు చేయకుండా కేంద్రం మీనమేషాలు లెక్కించడంపై కేంద్రం తీరును నిరసిస్తూ తమిళనాడులోని అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి.
అయితే కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బోర్డు ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున బోర్డు ఏర్పాటులో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోందని తమిళనాడుకు చెందిన పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
కావేరీ బోర్డు ఏర్పాటు ఉదంతంపై మంగళవారం నాడు సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. బోర్డు ఏర్పాటు చేయాలని ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. బోర్డు ఏర్పాటు కోసం నియమ నిబంధనలను ఎందుకు రూపొందించలేదని ప్రశ్నించింది.
మే 14వ తేదిన వ్యక్తిగతంగా హజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా హజరుకాకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.