షేక్ హసీనా రాకపై కేంద్రం కీలక ప్రకటన
Sheik Hasina: పొరుగుదేశం బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో గల హిండన్ ఎయిర్బేస్లో తలదాచుకుంటోన్నారు.
బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

సొంతదేశం నుంచి హెలికాప్టర్లో పారిపోయిన షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకం బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్కు చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్లో హిండన్ ఎయిర్బేస్కు వచ్చారు.
ఈ పరిణామాలపై విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ రాజ్యసభలో ఓ సుమోటో ప్రకటన చేశారు. షేక్ హసీనా రాజీనామా చేయాలనే సింగిల్ పాయింట్ అజెండాగా బంగ్లాదేశ్లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. భద్రత సిబ్బందితో చర్చించిన తరువాత రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.
సురక్షితంగా ఉండటానికి భారత్కు రావాలని హసీనా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అదే సమయంలో ఫ్లైట్ క్లియరెన్స్ కావాలంటూ తమకు విజ్ఞప్తి చేశారని జైశంకర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో తమకు ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఇక్కడికి రావడానికి అనుమతి ఇచ్చామని, సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు.
ఇప్పటికీ అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనలేదని జైశంకర్.. రాజ్యసభకు వివరించారు. అక్కడ చదువుకుంటోన్న విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను చేశామని, దౌత్య కార్యాలయాల ద్వారా అక్కడ నివసించే భారతీయుల క్షేమ సమాచారాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నామని అన్నారు.
బంగ్లాదేశ్లో 19,000 మంది వరకు భారతీయులు నివసిస్తోన్నారని, వారిలో 9,000 మంది విద్యార్థులే ఉన్నారని చెప్పారు. చాలామంది విద్యార్థులు జులైలోనే స్వదేశానికి వచ్చారని తెలిపారు. శాంతిభద్రతల పునరుద్ధరణ, సాధారణ పరిస్థితులు నెలకొనేంతవ రకు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉంటామని జైశంకర్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications