మహారాష్ట్రలో కరోనా కల్లోలంం షిర్డీ, సిద్ధివినాయక ఆలయాల మూసివేత
ముంబై: మహారాష్ట్ర కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూతోపాటు వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా, మహారాష్ట్రలో కరోనా ఉధృతి దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి ఉంచనున్నట్లు ప్రకటించింది. సాయిబాబా ఆలయంతోపాటు ప్రసాదాలయ, భక్త నివాస్ కూడా మూసివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ సమయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగనున్నాయి.

ఆలయం మూసివేసినప్పటికీ శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కరోనా ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు మాత్రం పనిచేస్తాయని ట్రస్ట్ స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయం సిద్ధివినాయక ఆలయం కూడా మూసివేస్టున్నట్లు అధికారులు ప్రకటించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో లోకల్ రైళ్లు నిలిపివేస్తారేమోనన్న ఆందోళనలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ముంబై లోకల్ రైళ్లు నిలిపివేతపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించడం తమకు ఇష్టం లేదని ఇప్పటికే సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేదంటే మరోసారి లాక్డౌన్ తప్పకపోవచ్చని హెచ్చరించారు. కాగా, మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా 40వేలకుపైగా రోజూవారీగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications