గోవాలో బీజేపీ తలనొప్పిగా ఉత్పల్ పారికర్.. ఆఫర్ ఇచ్చిన క్రేజీవాల్, శివసేన
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తలనొప్పిగా మారారు మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్. తన తండ్రి ప్రాతినిధ్య వహించిన పణాజీ సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే బీజేపీ ఇందుకు నిరాకరించింది. తమ పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఉత్పల్కు అర్హత లేదని గోవా ఎన్నికల వ్యవహారా ఇన్ ఛార్జీగా వ్యహరిస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారాయి. బీజేపీ అధిష్టానం తీరుపై ఉత్పల్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఉత్పల్ పారికర్కు కేజ్రీవాల్ ఆఫర్
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పరీక్కర్కు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. తమ పార్టీ తరుపున పోటీచేయాలంటూ ఆహ్వానాలు పలుకుతున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీలో చేరాతమంటే ఉత్పల్ను స్వాగతిస్తామన్నారు. తమ పార్టీ తరుపున పోటీ చేయాలని కోరారు. ప్రజలకు సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా బీజేపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. గోవాలో కాషాయ పార్టీకి పరాభవం తప్పదని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
పనాజీ సీటు కోసం పట్టు
తన తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన పనాజీ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని ఉత్పల్ భావించారు. అయితే ఆయన ఆశలపై బీజేపీ నీళ్లుచల్లింది. టికెట్ కేటాయింపు విషయంలో గోవా ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జీగా వ్యహరిస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరుపున పోటీ చేసేందుకు ఉత్పల్ అనర్హుడని పేర్కొన్నారు. కేవలం మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు అయినంత మాత్రాన ఉత్పల్ టికెట్ ఇవ్వలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ నేత అటానాసియో మోన్సెరటే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఫడ్నవీస్ వ్యాఖ్యలపై సీరియస్
ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఉత్పల్ తీవ్రంగా మండిపడుతున్నారు. నేర చరిత్ర ఉన్నవారికి మాత్రం టిక్కెట్ ఎలా ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గలమవుతున్నారు. పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు . అభ్యర్థుల ప్రవర్తన, వారి సమగ్రతను అధిష్టానం పరిగణలోకి తీసుకోదా.. అని విరుచుకుపడుతున్నారు. బీజేపీ వ్యవహారం ఇప్పుడు విపక్షాలకు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఉత్పల్కు మద్దతుగా శివసేన
ఉత్పల్ పారికర్కు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతుగా నిలిచారు. గోవా ఎన్నికల బరిలోకి దిగితే బీజేపీయేతర పార్టీలన్నీ ఆయనను గెలిపించాలన్నారు. ఈమేరకు సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. పనాజీలో అసెంబ్లీ స్థానం నుంచి ఉత్పల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దింపకూడదన్నారు. ఉత్పల్కు మద్దతుగా నిలవాలని కోరారు. ఇదే మాజీ సీఎం మనోహర్ పారీకర్కు మనమిచ్చే నిజమైన నివాళి అంటూ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్, శివసేన వ్యాఖ్యలతో ఇప్పడు బీజేపీ మరింత ఇరకాటంలో పడింది.