సంజయ్ రౌత్: 162 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: కాస్సేపట్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సభ్యుల పరేడ్..!
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గంతో ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల తరువాత మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్సీపీ చీలిక వర్గంలో శాసన సభ్యుల సంఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు అనుగుణంగా లేదంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరేడ్ ను ఏర్పాటు కానుంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కు చెందిన 162 మంది శాసన సభ్యులు ఈ పరేడ్ లో పాల్గొనబోతున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు.

గ్రాండ్ హయత్ హోటల్ వద్ద..
సోమవారం సాయంత్రం 7 గంటలకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద ఈ పరేడ్ ఏర్పాటవుతుందని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంటే సరిపోతుందని, ప్రస్తుతం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి వద్ద 162 మంది సభ్యుల బలం ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దల కంటికి చేరాలనే ఉద్దేశంతోనే తాము పరేడ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మా బలమేంతో మీరే చూడండి..
`ఈ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ హయత్ వద్ద కూటమి శాసన సభ్యులతో పరేడ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. మా బలం 162. మా బలమేంటో, పరేడ్ శక్తి ఏమిటో వచ్చి, మీరే చూడండి..` అని సోమవారం మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. 145 మంది ఎమ్మెల్యే మ్యాజిక్ ఫిగర్ లేనప్పటికీ.. బీజేపీ నాయకులు అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సంజయ్ రౌత్ విమర్శించారు.

అలా.. ఎలా?
145 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే విషయాన్ని తెలిసి కూడా బీజేపీ నాయకులు బరితెగించారని విమర్శించారు. 105 మందితో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అజిత్ పవార్ వెంట కనీసం పదిమంది కూడా లేరని అన్నారు. అజిత్ పవార్ వెంట ఎవరూ లేరనే విషయాన్ని నిరూపించడానికే తాము పరేడ్ ను నిర్వహించబోతున్నట్లు చెప్పారు.

దేవేంద్ర ఫడ్నవీస్ దూకుడు..
మరోవంక- శనివారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. కార్యరంగంలోకి దిగారు కూడా. చాలినంత సంఖ్యా బలం లేనప్పటికీ.. బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఈ ఉదయం సచివాలయానికి చేరుకున్న దేవేంద్ర ఫడ్నవీస్.. తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇంకా బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. మంగళ లేదా బుధవారం ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications