గుజరాత్ను మించి అభివృద్ధి, సర్కారులో సేన:ఫడ్నవీస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో శివసేన చేరుతుందని చెప్పారు.
ప్రస్తుతం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో చర్చలు జరుగుతున్నాయని... త్వరలోనే ఆ చర్చలు ఓ కొలిక్కి రానున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. శివసేన సభ్యులు తమ ప్రభుత్వంలో చేరే ప్రకటనపై సరైన సమయంలో వస్తుందన్నారు. ఇక శుక్రవారం నాడు జరిగిన మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక ఎన్సీపీ, బీజేపీకి బహిరంగంగానే పొత్తు ప్రకటించినా ఆ పొత్తుకు ప్రధాని మోడీ సుముఖంగా లేరని అన్నారు. ఇక మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యవహారంపై స్పందించిన ఫడ్నవీస్ అవినీతికి పాల్పడ్డ వారు తమ సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.
మహారాష్ట్రను అభివృద్ధిలో గుజరాత్ను తలదన్నే రీతిలో చేస్తానని ప్రకటించారు. గుజరాత్ను మించిన అభివృద్ధి మహారాష్ట్రలో నమోదైతే ప్రధాని, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కూడా సంతోషిస్తారని తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రకు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అతి పిన్న వయస్కుల్లో రెండో వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.