150కి తగ్గం, బిజేపీయే: శివసేన, చిన్నపార్టీల హెచ్చరిక
అయితే, ఈ ఒప్పందాన్ని శివసేన-బీజేపీ కూటమిలోని చిన్న పార్టీలు తప్పుపడుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎస్ఎస్పీ, ఆర్ఎస్పీ, శివసంగ్రామ్ పార్టీలు కూటమిగా ఉన్నాయి. వీటిని మహాయూటీగా పిలుస్తున్నారు. అయితే, తమకు కేవలం ఏడు స్థానాలే కేటాయించడం పైన ఎస్ఎస్పీ, ఆర్ఎస్పీ, శివసంగ్రామ్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దీనిపై శివసేన సీనియర్ నేత రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. తమ పార్టీ 150 స్థానాలకు తక్కువగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహాయూటీ కూటమి విచ్ఛిన్నం కాకుండా చూసే బాధ్యత బీజేపీ పైనే ఉందన్నారు. బీజేపీ ఐదు సీట్లను వదులుకుంటే మిగతా పక్షాలకు ఆరు సీట్లు ఇవ్వవచ్చునని చెప్పారు. మహాయుటీని ఉంచేందుకు తమ పార్టీ ఇప్పటికే 18 సీట్లను త్యాగం చేసిందన్నారు.
రాందాస్ కదమ్ పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ థాకరే నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఐదు స్థానాలు వదులుకుంటే, శివసేన ఒక స్థానాన్ని వదులుకొని... 151లో 150 స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దపడుతోంది.
మరోవైపు, తమకు ఎట్టి పరిస్థితుల్లో 18 స్థానాలు ఇవ్వాలని ఎస్ఎస్పీ, ఆర్ఎస్పీ, శివసంగ్రామ్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. శివసేన, బీజేపీలు కలిసి తమను మోసం చేశాయని, తాము అవసరమైతే మహాయూటీ నుండి తొలిగిపోతామని, తాము కలిసి పోటీ చేస్తామని ఎస్ఎస్పీ నేత ఒకరు చెప్పారు. బీజేపీ, శివసేన తమకు అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే ఈ సాయంత్రం తమ జాయింట్ క్యాండిడేట్స్ జాబితా విడుదల చేస్తామన్నారు.
మహాయూటీలోకి తమను దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే తీసుకు వచ్చారని, అతనిని నమ్మి తాను ఈ అలయెన్సులోకి వచ్చామని చెబుతున్నారు. తమ మూడు పార్టీలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే ఇవ్వడం ద్వారా బీజేపీ, శివసేనలు తమను అవమానించాయన్నారు.
తమకు మరో సీటు ఇవ్వకపోయినప్పటికీ.. తమ పార్టీ నేతలను ముఖ్యమంత్రులుగా రొటేషన్ పద్ధతిలో చేయాలని మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో కోరామన్నారు. తమను ఉపయోగించుకొని అందరు కూడా ఎక్కువ సీట్లు తీసుకోవాలని భావిస్తున్నారన్నారు.
తమకు అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా ప్రజల వద్దకు వెళ్లి ఆ రెండు పార్టీలు చేసిన ద్రోహాన్ని చెబుతామన్నారు. వారు తమను తియ్యగా పొడిచారని, వారి బండారం బయటపెడతామని ఎస్ఎస్పీ, ఆర్ఎస్పీ, శివసంగ్రామ్ పార్టీ నేతలు చెబుతున్నారు. వారు తమను బిచ్చగాళ్లలా చూస్తున్నారని, ఇక తాము వారి వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని, వారే తమ వద్దకు రావాలని చెబుతున్నారు.